High Court | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల భర్తీలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయం తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు షరతు విధించింది. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ అయిన జీవో 33కి అనుగుణంగా గ్రూప్-1 పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచతూ టీఎస్పీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. దీన్ని సవాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం రిజర్వేషన్లు 54 శాతానికి పెరిగాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించితే రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణలకు విరుద్ధమవుతుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పెంపునకు సామాజిక అధ్యయనం నిర్వహించాలని, అటువంటిదేమీ లేకుండా ఎస్టీ రిజర్వేషన్లను పెంచడం, గ్రూప్-1 పోస్టుల్లో ఎస్టీలకు 10% రిజర్వు చేయడం చెల్లదని వాదించారు. దీంతో ఆ నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. ఈలోగా జీవో 33పై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించింది.