Mancherial | మంచిర్యాల అర్బన్, ఆగస్టు 4 : కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వేళ.. మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చి, తమ అంబులెన్స్లోనే వెళ్లాలని పట్టుబట్టడం చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పి.ఆర్. శంకరయ్య అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వెలగపూడి నాగభూషణం (65) సోమవారం రాత్రి సుమారు 10.30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికంగా తమకు తెలిసిన అంబులెన్స్లో ఆయనను పట్టణంలోని వసుధ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్లో తీసుకెళ్తుండగా.. ఆస్పత్రి వద్ద ఉండే అంబులెన్స్ సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
మేం లైన్లో ఉన్నాం.. మా అంబులెన్స్లోనే డెడ్ బాడీని తీసుకెళ్లాలని తమతో వాగ్వాదానికి దిగారని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటికే బయటకు వెళ్లిన తమ వాహనాన్ని బలవంతంగా తిరిగి ఆస్పత్రికి రప్పించారని.. అక్కడి నుంచి తమ అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించారని పేర్కొన్నారు. ఆ సమయంలో “ఇక్కడ అంబులెన్స్ పాయింట్ మాది.. ఇక్కడ మేమే సీనియర్లం.. మేం చెప్పిందే నడవాలి. మా తర్వాతే మీరు “ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇటువంటి సున్నితమైన సమయంలో ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.