NEET UG | హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షల్లో కాపీయింగ్, తప్పిదాలకు పాల్పడేవారిని అడ్డుకొనేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఈసారి సాంకేతికతను అస్త్రంగా వినియోగించనున్నది. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలెటికల్ టూల్ను ఉపయోగించనున్నది.
ఇది నిరంతరం సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్తో విద్యార్థుల అనుమానాస్పద కదలిలకను పసిగడుతుంది. విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. జాతీయంగా ఈపరీక్ష పెన్ పేపర్ పద్ధతిలో ఆఫ్లైన్లో జరగనున్నది. ఈఏడాది దేశవ్యాప్తంగా నీట్కు రికార్డుస్థాయిలో 23,81,833మంది దరఖాస్తు చేసుకొన్నారు. హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వరంగల్లో నిర్వహించే ఈపరీక్షకు తెలంగాణ నుంచి 70వేల మంది హాజరుకానున్నారు.