CM Revanth Reddy | హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి దిగొచ్చారు. పంటలు కోతకొస్తున్నా రైతుబంధు పైసలు రాకపోవటంపై కేసీఆర్ తన ప్రతి సభలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మీకు రైతుబంధు పడిందా?’ అంటూ కేసీఆర్ అడిగే ప్రశ్నకు పడలేదంటూ రైతు లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చూస్తున్నవా ఇది ప్రజల మాట అని కేసీఆర్ సాక్ష్యం చూపిస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ముఖ్యమంత్రి రైతుకు మరో వాయిదా పెట్టారు. ఈ నెల 8లోపు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం రైతుభరోసా వేస్తలేదని కేసీఆర్ మాట్లాడుతున్నడు. మొత్తం 69 లక్షల మంది రైతులుంటే ఇప్పటికే 65 లక్షల మందికి రైతుభరోసా అందించాం. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. ఈ నెల 8 లోపు చివరి రైతు వరకు రైతుభరోసా బకాయిలు చెల్లించే బాధ్యత మాది. 150 రోజులు తిరిగే లోపలే రూ.7,500 కోట్ల రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. కానీ, కేసీఆర్ దిగిపోయిండు.. రైతుభరోసా అగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. మే 9 నాడు అమరవీరుల స్థూపం ముందు చర్చ పెడుదాం వస్తవా? రాష్ట్రంలో ఈ నెల 9లోపు ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే అమరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ రైతులందరికీ రైతుభరోసా అందితే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తవా చంద్రశేఖర్రావు?’ అని అన్నారు.
రైతుబంధుపై కేసీఆర్ ప్రశ్నలతో సీఎం రేవంత్రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కొత్తగూడెం సభలో కేసీఆర్పై తిట్ల దండకమే కారణం. తాజా ప్రకటనతో రైతుబంధు అందరికీ వేయలేదని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా అంగీకరించారు. అలాంటప్పుడు ఫలానా తేదీన అందరికీ రైతుబంధు అందిస్తామని చెప్తే సరిపోతుంది. కానీ కేసీఆర్ వల్లే రైతుబంధు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న కోపంలో రేవంత్రెడ్డి ఉన్నట్టు కనిపించింది. అందుకే కేసీఆర్ను తనకు అచ్చొచ్చిన భాషలో తిట్టి.. ఆ తర్వాత ఈ నెల 8న రైతుబంధు ఇస్తామని ప్రకటించారు. అయితే సీఎం కోపానికి, ఫ్రస్ట్రేషన్కు కారణం లేకపోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రోడ్షోల్లో రైతుబంధు రాకపోవటంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పంట వేసుకునే సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధు.. కోతలు పూర్తవుతున్నా ఇవ్వటం లేదంటూ నిలదీస్తున్నారు. ఇంకెప్పుడు రైతుబంధు ఇస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి రోడ్షోలోనూ ఇదే పరిస్థితి. ఇలా కేసీఆర్ ప్రశ్నల దాడి.. రైతుల నుంచి స్పందనతో సీఎం రేవంత్రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయినట్టు ఉన్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ను తగ్గించుకునేందుకే కేసీఆర్ను తిట్టారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘రైతుబంధు వేస్తలేరని కేసీఆర్ మాట్లాడుతున్నడు.. ఓరి సన్నాసోడా, సోయిలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివాణాగా’ అంటూ కేసీఆర్పై పరుష వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు కాబట్టే రేవంత్రెడ్డి స్పందించారని, లేకుంటే ఎప్పటికీ స్పందించేవారు కారేమోనని రైతులు అంటున్నారు.
రైతుబంధు ఇవ్వటంపై సీఎం రేవంత్రెడ్డి రోజుకో మాట మార్చుతున్నారు. అలవోకగా తేదీలు, గడువులను మార్చేస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు గడువు మార్చేశారు. డిసెంబర్లోపు పూర్తి చేస్తామని ఓసారి, ఫిబ్రవరిలోపు అని మరోసారి, మార్చి 15 నాటికి అని ఇంకోసారి, మార్చి 31 నాటికి అంటూ చివరి గడువు చెప్పారు. ఈ గడువులన్నీ పోయాయి తప్ప, రైతులకు రైతుబంధు మాత్రం రాలేదు. ఇక తాజాగా కేసీఆర్ ఒత్తిడితో ఈ నెల 8 నాటికి ప్రతి రైతుకు రైతుబంధు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మాటలపై రైతులకు నమ్మకం కలగటం లేదు. ఇప్పటికే అనేకసార్లు గడువు పెట్టి.. తప్పారని, ఈ గడువుపైనా నమ్మకం లేదని అంటున్నారు.
సరిగ్గా ఎన్నికల తేదీ సమీపించగానే రైతుబంధు, పంటనష్ట పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం వీటి అమలు ఆలస్యం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 13న పోలింగ్ జరగనున్నది. సరిగ్గా ఎన్నికల తేదీకి ముందు రైతుబంధు, పంట పరిహారం అందించి లబ్ధి పొందాలనే దురుద్దేశం కాంగ్రెస్కు ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉద్దేశమే లేకుంటే.. ఎప్పుడో డిసెంబర్ 9న ప్రారంభించిన రైతుబంధు పంపిణీ నాలుగున్నర నెలలుగా పూర్తి చేయకుండా సరిగ్గా ఈ నెల 8నే పూర్తి చేస్తామనటం ఏమిటన్న సందేహాలకు తావిస్తున్నది. మార్చిలో జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చేందుకు ఎన్నికల సంఘం పది రోజుల క్రితమే అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వం వచ్చే 3-4 రోజుల్లో పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల ప్రయోజనాల కన్నా, ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.