చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ చక్రీపురంలో అభయ అసోసియేషన్ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అభయ ప్రోఫ్యాషన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల ఆధ్వర్యంలో ప్రపంచ ఔత్సాహికపారిశ్రామికవేత్తల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభయ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఆయా రంగాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, అదేవిధంగా శిక్షణ తీసుకున్న మహిళలు ఔత్సహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళాపారిశ్రామికవేత్తలు సుచిత్రరెడ్డి, అలివేణి, గౌరీ, షకీలా, అనిత, భానులతో పాటు మహిళలు పాల్గొన్నారు.