కీసర, ఆగస్టు : దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి నర్సంపల్లిలో మంగళవారం మండల అధికారుల బృందం అధికారులు దళిత వాడల్లో పర్యటించి ప్రజల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న దళిత బస్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కారిస్తామని, ఆ బస్తీలో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతి సదుపాయాలైన సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కారిస్తామన్నారు.
బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా ఎక్కువ నిధులను విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ అర్హులైన వారందరికి దళితబంధు పథకం కింద రుణాలను అందించి వారిని ఆర్థికంగా నిలబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మంగతాయారు, నర్సంపల్లి సర్పంచ్ సత్తమ్మ, మండల ఎఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఎఈ స్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వప్న, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.