వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి గ్రామంలో స్త్రీ నిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు వెలుగుచూడటం సంచలనంగా మారింది. స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి నెలనెలా వసూలు చేసిన వాయిదాల సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వీఏఓలతోపాటు అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్(సీసీ)పై కూడా చర్యలు తీసకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
– బషీరాబాద్, ఆగస్టు 4
బషీరాబాద్, ఆగస్టు 4 : మండలంలోని ఎక్మాయి గ్రామంలో స్త్రీ నిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి నెలనెలా వసూలు చేసిన వాయిదాల సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వీఏఓలతో పాటు అప్పటి కమ్యూనిటీ కోఆర్డినేటర్(సీసీ)పై కూడా చర్యలు తీసకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
2020లో స్త్రీనిధి పథకం కింద ఎక్మాయి గ్రామంలోని సుమారు 20 స్వయం సంఘాలకు భారీ మొత్తంలో రుణాలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళలు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. ఆ వసూళ్ల బాధ్యత అప్పట్లో విధులు నిర్వహించిన వీఏఓలు స్వరూప, వాణిశ్రీలకు అప్పగించారు. అయితే మహిళల నుంచి సేకరించిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా దారి మళ్లించినట్లు అడిట్లో బయటపడింది. అడిట్ నివేదిక ప్రకారం వీఏఓ స్వరూప రూ.4,05,761, వీఏఓ వాణిశ్రీ రూ. 3,05,498 వసూలు చేసినప్పటికీ మొత్తం రూ.7,11,259 బ్యాంకుకు జమ కాలేదు.
అంతేకాకుండా మరో రూ.4లక్షలకుపైగా లావాదేవీల లెక్కలు కూడా తేలాల్సి ఉందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. ఆ మొత్తంపై పూర్తి విచారణ జరిపి బాధ్యుల నుంచి వసూలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పటి సీసీ రాములు పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో డీఆర్డీవో శ్రీనివాస్ వీఏఓలు స్వరూప, వాణిశ్రీతో పాటు అప్పటి సీసీ రాములును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, తాము క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించినప్పటికీ బ్యాంకు రికార్డుల్లో బకాయిలు చూపిస్తే భవిష్యత్తులో స్త్రీ నిధి రుణాలకు అనర్హులమయ్యే ప్రమాదం ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పేరుపై ఉన్న బకాయిలను వెంటనే సరిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మిగిలిన రూ.4లక్షల లు కూడా వెలికితీయాలని వారు అధికారులకు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా ఏపీఎం పద్మారావు, ప్రస్తుత ఎక్మాయి సీసీ కవితకు వివరణ కోరుతూ అధికారులు మెమో జారీ చేశారు. వివరణ సంతృప్తి కరంగా లేనిచో వీళ్లపై కూడా చర్యలు ఉంటాయని డీఆర్డీవో అధికారి పేర్కొన్నారు.