ఆటలో అనుకున్నది జరగనప్పుడు లేదా పాయింట్ చేజారినప్పుడు చాలామంది నిరాశలో మునిగిపోతారు. కానీ, ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా శైలి భిన్నమైనది. మైదానంలో ఆవేశాన్ని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచే ఈ చాంపియన్, తన కోపాన్ని ప్రదర్శించడం వెనుక ఉన్న పరమార్థాన్ని వెల్లడించింది. ‘కొన్నిసార్లు భావోద్వేగాలను పూర్తిగా బయటికి పంపించేయాలి. అప్పుడే మనసు ఖాళీ అవుతుంది. ఆటపై దృష్టి పెట్టడానికి, మ్యాచ్ను కొత్తగా ప్రారంభించడానికి ఇది సాయపడుతుంది. చూడటానికి ఇది కోపంగా, తీవ్రంగా అనిపించవచ్చు, కానీ ఆటపై దృష్టి నిలిపేందుకు నాకు ఆ ఆవేశం అవసరం’ అని మైదానంలో తన ప్రవర్తనపై సబలెంకా స్పష్టత ఇచ్చింది. ఓ డిజిటల్ కవర్ స్టోరీ ఇంటర్వ్యూలో తన మానసిక స్థితిపై ఆమె స్పందిస్తూ.. గతంలో మైదానంలో కోపం వస్తే తనను తాను తీవ్రంగా శిక్షించుకునేదాన్నని, కానీ ఇప్పుడు దానిని ఒక రీసెట్ బటన్లా వాడుతున్నానని చెప్పుకొచ్చింది.
మైదానంలో అరవడం లేదా రాకెట్ విసిరేయడం ఒక ప్రదర్శన కాదు. ఆ క్షణంలో మనసులోని ఆవేశాన్ని ఖాళీ చేయడానికి మాత్రమే. ఆ నెగెటివిటీని మరుసటి పాయింట్కి మోసుకెళ్తే మరింత నష్టం జరుగుతుందని వెల్లడించింది. ఆ క్రీడాకారిణి మాటలు కేవలం టెన్నిస్ కోర్టుకే పరిమితం కావు. ఆఫీసులో ఒక విఫలమైన ఈమెయిల్, ఎదురైన విమర్శ, చేజారిన అవకాశం గురించి ఆలోచిస్తూ రోజంతా పాడుచేసుకునే ప్రతి ఒకరికీ ఇదొక గొప్ప పాఠం. కోపాన్ని బయటికి పంపిన వెంటనే తదుపరి పనిపై దృష్టి పెట్టాలి. ఆవేశాన్ని వెళ్లగకాక, మైండ్ రీసెట్ చేసుకుని తదుపరి అడుగు వేయడమే ముఖ్యం. తప్పు జరిగినప్పుడు భావోద్వేగానికి లోనవడం సహజం. దాన్ని అలాగే మోస్తూ ఉండటం వల్ల పనిపై శ్రద్ధ తగ్గుతుంది. కాగా, ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా ఆ భావోద్వేగాన్ని బయటికి పంపించేలా ప్రవర్తించడం మేలైన పద్ధతి అంటున్నారు నిపుణులు.