న్యూఢిల్లీ : పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానం 300 అడుగుల మేర కిందకు జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ2379 మంగళవారం పుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యంలో విమా నం తీవ్రమైన కుదుపులకు గురై, ఒక్కసారిగా 300 అడుగుల మేరకు కిందకు జారిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో 12 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విమానాశ్రయ వైద్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో దవాఖానకి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం లోపలి సీలింగ్ భాగాలు దెబ్బతిన్నాయని సమాచారం. ప్రయాణం ప్రారంభమైన గంటన్నర తర్వాత విమానం భారీ కుదుపులకు గురైందని, రెండు మూడు నిమిషాల పాటు భయానక వాతావరణం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పౌరవిమానయాన భద్రతా డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.