దుండిగల్,ఏప్రిల్6 : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల్లోని వాణిజ్య దుకాణాలను బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం మల్కాజ్గిరి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సముదాయాలను అక్కడే నివసించే స్థానికులకే కేటాయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వేలం వేయకూడదని పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. సోమవారం దుండిగల్ డి.పోచంపల్లి పరిధిలోని డబుల బెడ్ రూమ్ ఇళ్లలో సీపీఎం బృందం పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రవిలు మాట్లాడుతూ గత ప్రభుత్వం బెడ్ రూమ్ ఇళ్ల నిర్వాహణ కోసం వాణిజ్య సముదాయాను ఏర్పాటు చేసిందని, వాటిద్వారా ఇచ్చే ఆదాయం నివాసితులకు ఉపయోగపడాలని సూచించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుకాణాలను వేలం వేసి అమ్మాలని చూడడం దుర్మార్గమని, తక్షణమే ఈ ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి వేలం పాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్, రాజశేఖర్, శంకర్, లింగస్వామి, సంతోష్, సత్యనారాయణ, వీరమల్లు, కమల కుమారి, శ్రీనివాస్, రవినాయక్, డబుల్ బెడ్రూంల లబ్ధిదారులు పాల్గొన్నారు.