జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేయర్ మేకల కావ్య జవహర్నగర్ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నారు. బాలాజీనగర్ నుంచి చెన్నాపురం వరకు రోడ్డు మరింత గుంతలమంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరిగేవి.
గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న జవహర్నగర్ నేడు కార్పొరేషన్ ఏర్పాటుతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుంది. దీంతో దశాబ్దాల కలకు తెర పడిందన్నారు. గుంతలమయంగా రోడ్డు ఉండటంతో వర్షాకాలంలో రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. డివైడర్ రోడ్డుతో వాహనదారులు సికింద్రాబాద్, యాప్రాల్, అల్వాల్ తదితర ప్రాంతాలకు వెళ్లటానికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ప్రాంతం కాబట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ రూపురేఖలు మారుతాయి: మేయర్ మేకల కావ్య
గతంలో రోడ్డు సరిగాలేక పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జవహర్నగర్లో అధికంగా పేద ప్రజలు నివసిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం వారికోసం అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తుందన్నారు. రోడ్డు విస్తరణతో పట్టణ రూపురేఖలు మారిపోతాయి. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తొలగిపోయి, ప్రమాదాలను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.