MLA Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 7: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగెత్తిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు, సాధారణ ప్రజలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కండ్ల ముందే కనబడుతుందని, కూకట్పల్లిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో చేరిన నేతలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.