Keralam : కేరళ రాష్ట్రం (Kerala State) పేరును ‘కేరళం (Keralam)’ గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో లేకపోవడంతో ఆయన తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు-2026’ ను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలతోపాటు ఇతర కీలక అంశాలపై అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమనే బిల్లుకు సభ ఆమోద ముద్రవేసింది.
మలయాళంలో తమ రాష్ట్రాన్ని ‘కేరళం’ అని పిలుస్తారని, అధికారికంగా కూడా అదే పేరును ఖరారు చేయాలని కేరళ శాసనసభ 2024 జూన్లో తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రపతి ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. 2026 జూలైలో అసెంబ్లీ దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో సవరణలు జరగనున్నాయి.