మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రైవేటు యాజమాన్యాల అధిక ఫీజులకు స్వస్తి చెప్పాలని మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయుడు డాక్టర్ బి.శ్రీధర్ అన్నారు. మేడ్చల్ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలల్లో శుక్రవారం ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులను 6, 7, 8వ తరగతుల్లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్నందువల్ల మేడ్చల్ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6, 7, 8వ తరగతులకు టీసీ లేకుండానే అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపారు.
9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం టీసీ అవసరం అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరవలసిందిగా సూచించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణ, ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.