మూసాపేట: ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం మూసాపేటలోని పటేధర్ భవన్లో కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్ కమిటీ మీటింగ్కు ముఖ్య అతిధిగా చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. మండపాల వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు చేపడుతూ పర్యవేక్షించాలని, దర్శనాలకు వచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు.
పోలీస్ శాఖ జారీ చేసిన ఆదేశాలను అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు, బాచుపల్లి సీఐ నర్సింహారెడ్డి, ఎస్సైలు శంకర్, రామకృష్ణ, సురేష్, రవీందర్రెడ్డి, అబ్దూల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.