కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మేరకు.. అసిస్టెంట్ ప్రొహిభిషన్ ఎక్సైజ్ సూపరిండెంట్ మాధవయ్య, జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి సహదేవుడు నేతృత్వంలో విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేపట్టారు.
ఫత్యేనగర్లోని పార్ధివాడకు చెందిన కల్వాల అంజు(24) అనే మహిళ ఇంట్లో తనీఖీ చేయగా 1.083 కేజీల ఎండు గంజాయి లభించింది. తన సోదరుడు అక్షయ్(28) బయట నుంచి తీసుకొచ్చి తన సోదరి ద్వారా విక్రయాలు జరిపిస్తున్నారు. అక్షయ్ పరారీలో ఉండడంతో అంజుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.