మూసాపేట, జూన్ 30: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం మూసాపేట డివిజన్లో రూ. 1.24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
యాదవ బస్తీలో రూ.19.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం, మోతీనగర్లో రూ. 27.50 లక్షలు, కబీర్నగర్లో రూ. 56లక్షలు, రాయల్గార్డెన్ వద్ద రూ. 21 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బస్తీలు, కాలనీల్లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యులు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మూసాపేట డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.