కేపీహెచ్బీ కాలనీ : కరోనా టీకాపై అపోహలు వీడాలని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని కోవిడ్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్బీ కాలనీ మలేషియన్ టౌటన్షిప్లో జీహెచ్ఎంసీ చేపట్టిన ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో లాక్డౌన్ను ప్రకటించడంతో పాటు కరోనా పరీక్షలు చేయడం, ఇంటింటికీ జ్వరం సర్వేను నిర్వహించి ముందస్తుగా మందులు ఇవ్వడం వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా వేయడం వల్ల కరోనాను నియంత్రించవచ్చన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని భౌతిక దూరం, మాసుకలు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కాలనీలు, బస్తీలలో చేపట్టిన ఇంటింటి సర్వేలో వివరాలు చెబితే ఇంటికే వచ్చి కరోనా టీకా వేయడం జరుగుతుందని మాధవరం తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వందశాతం వ్యాక్సినేషన్ కావాలని కోరారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, డాక్టర్ పూజారెడ్డి, ఏఎంహెచ్వో సంపత్కుమార్, టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.