ఉప్పల్, జూన్ 1 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో తాగునీటి సరఫరా, నూతన పైపు లైన్ల ఏర్పాటు లీకేజీల నివారణ, మురుగునీటి నిర్వాహణ తదితర అంశాలపై సోమవారం జలమండలి సీజీఎం పంకజ, జీఎం సంతోష్లతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను, వేసవి కాలంలో నీటి కొరత లేకుండా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
అదే విధంగా పాత పైపులైన్ల కారణంగా తరచూ ఏర్పడుతున్న లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పైపులైన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మురుగు నీటి సమస్యలు అధికంగా ఉన్న కాలనీలలో ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులతో పాటు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.