ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ల గణన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పూర్తయింది. భద్రాద్రిలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లకు గాను 8,63,314 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు పూర్తిచేశారు. మరో 1,32,884 ఓటర్లను అన్ కలెక్టబుల్ జాబితాలో పెట్టారు. వీరి ఓట్లను తుది ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించనున్నారు. వీటిలో ఇంటి వద్ద అందుబాటులోలేని 8,777 మందికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోతే వీరందరినీ జాబితా నుంచి తొలగిస్తారు. ఈ సమగ్ర సవరణలో మృతిచెందిన ఓటర్లు 31,189 మంది, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన ఓటర్లు 78,329 మంది, డబుల్ ఓట్లు ఉన్న ఓటర్లు 14,281 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇక, ఖమ్మం జిల్లాలో 1.58 లక్షల ఓట్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో 87.31 శాతం ఓట్లు డిజిటలైజ్ అయ్యాయి. ఎస్ఆఐర్ ప్రక్రియకు ముందు జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల్లో 12,43,781 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ గణన ఫారాలు జారీ అయ్యాయి. అందులో 10,85,927 మంది ఓటర్ల గణన ఫారాలు పూర్తి చేసి ఇవ్వడంతో బీఎల్వోలు వాటిని డిజిటలైజేషన్ చేశారు. 1.58 లక్షల ఓట్లు వివిధ కారణాల వల్ల తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. -ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ అశ్వారావుపేట, ఆగస్టు 11
భద్రాద్రి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. వాస్తవంగా గత జూలై 31తో ముగియాల్సి ఉంది. అప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకూ గడువు పొడిగించింది. బీఎల్వోలందరూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను సేకరించి అక్కడికక్కడే డిజిటలైజ్ చేశారు. అయినప్పటికీ సమయం సరిపోకపోవడంతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ప్రక్రియను వేగవంతం చేశారు. అయినప్పటికీ జిల్లా ఎస్ఐఆర్ శాతం 86.66గా నమోదైంది. ఇంకా 13.34 శాతం మిగిలిపోయింది. వీరందరివీ అందుబాటులో లేకపోవడంతోపాటు డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు, వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఓట్లు 9,96,198 మంది ఓటర్లు ఉండగా.. 8,63,314 (86.66 శాతం) మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా 1,32,884 (13.34 శాతం) మందిని అన్ కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించారు. వీరిలో 31,189 మంది మరణించగా.. 78,329 మంది ఇతర ప్రాంతాల్లో శాశ్వతంగా స్థిరపడ్డారు. 14,281 మందికి డబుల్ ఓట్లు ఉన్నాయి. 8,777 మంది ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో లేరు. ఇతరులు 308 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇంచుమించు ఈ ఓటర్లను తుది జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇంటి వద్ద అందుబాటులోలేని ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. వారి నుంచి వచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
మ్యాపింగ్ కాని ఓటర్లకు అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. ఈ జాబితాలో 8,777 మంది ఉన్నారు. వీరంతా సరైన పత్రాలు చూపించకపోతే వారి ఓట్లను తుది జాబితా తొలగిస్తారు. ఒక ఓటరు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉండడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. దీంతో ఎక్కడ ఓటు హక్కు కొనసాగించాలన్న అభిప్రాయాన్ని సదరు వ్యక్తుల ద్వారా డిక్లరేషన్ తీసుకుంటారు. ‘సర్’ ప్రక్రియ ముగియడంతో జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు కార్యాచరణ చేస్తోంది.
ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా పాలేరులో 92.21 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. అత్యల్పంగా ఖమ్మంలో 75.42 శాతమే పూర్తయింది. మధిరలో 90.87 శాతం, సత్తుపల్లి 91.81 శాతం, వైరాలో 91.27 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 48,131 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. అలాగే 33,380 మంది ఓటర్లు మరణించినట్లు ఈ ప్రక్రియలో తెలింది. 1,01,549 మంది ఓటర్లు తమ ఓటు హక్కును శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు బదలాయించుకున్నారు. 11,371 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సకాలంలో అందించలేదు.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం ముగిసినందున ఈ నెల 17న ముసాయిదా జాబితాను విడుదల చేస్తాం. అప్పటి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు వారి ఆధారాలు సమర్పిస్తే పరిశీలిస్తాం. వాస్తవికత ఉంటే వారి పేర్లను జాబితాలో యథావిధిగా చేర్చుతాం. తొలగించాల్సిన ఓట్లను పూర్తి విచారణ తర్వాతే తొలగిస్తాం. డబుల్ ఓట్లను మాత్రం తప్పనిసరిగా తొలగిస్తాం. అక్టోబర్ 19న తుది జాబితాను ప్రచురిస్తాం. ఆ తరువాత కొత్త ఓట్ల నమోదుకూ అవకాశం ఉంటుంది.
-రంగాప్రసాద్, ఎన్నికల సూపరింటెండెంట్, భద్రాద్రి కొత్తగూడెం