కీసర: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు, ప్రధాన స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు వంగిపోకుండా ఉండేందుకు ఆసరాగా ఊత కర్రలు, జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. మండలంలో ఈ ఏడాది10 పంచాయతీల్లో కలిపి 2.20లక్షల మొక్కలను నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీటిలో 50వేల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్డులకు ఇరువైపులా ఉన్న ప్రదేశాలు, ఖాళీ ప్రదేశాల్లో పొలం గట్లు తదితర ప్రాంతాల్లో మొక్కలను నాటారు.
నాటిన ప్రతి మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇనుప, ప్లాస్టిక్ జాలీలను మొక్క చుట్టూ కంచెగా పెట్టిస్తున్నారు. ట్రీగార్డ్స్ పైభాగంలో హరితహారంలో నాటినట్లుగా చూసే విధంగా గ్రీన్మ్యాట్ను కట్టిస్తున్నారు. నాటిన మొక్కలు బతకాలనే ఉద్దేశ్యంతో సంరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఈ పనులను కీసర ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్లకు తగిన సూచనలిస్తున్నారు. వర్షాలు పడకపోతే మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సూచిస్తున్నారు.
మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నాం: కీసర ఎంపీడీవో పద్మావతి
అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ట్రీగార్డ్స్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సూచిస్తున్నాం. వీటితో పాటు హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంటింటికి పంపిణీ చేసిన మొక్కలను బాధ్యతగా పెంచాలని సూచిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు.