అబిడ్స్ (హైదరాబాద్) : పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) కే దక్కుతుందని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి (BRS candidate ) గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( Gaddam Srinivas Yadav) పేర్కొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం గోషామహల్ సెగ్మెంట్ గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని బిర్లా మందిర్ తదితర ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అభివృద్దికి పాటు పడే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేసిందని వెల్లడించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో (Six Guarntees) ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. వందరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు. ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు శీలం సరస్వతి, శ్రీనివాస్ యాదవ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.