Indiramma Illu | మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇంటి పథకంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో అసలైన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో ఇప్పటి వరకు 1, 284 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులకు అందించడం బదులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని తెలిసిపోయింది. ఉదాహరణకు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. ఇందులో సుమారు 40 శాతం మంది కాంగ్రెస్ నాయకుల అనుచరులు, వారి బంధుమిత్రులు ఉండటం చూస్తుంటే అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని ఇట్టే అర్థమైపోతుంది. అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేశారని ఇప్పటికే మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి అసలైన లబ్ధిదారులు ఫిర్యాదు కూడా చేశారు.
కాంగ్రెస్ కనుసన్నుల్లోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
కాంగ్రెస్ కనుసన్నుల్లోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న క్రమంలో అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అధికారుల మాట చెల్లుబాటు కాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి ఇప్పటి వరకు మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని.. ఇంకా ఇప్పటి వరకు మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలలో దరఖాస్తుల పరిశీలనే ప్రారంభం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
అనర్హులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయాలి
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో అనర్హులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయాలని అసలైన అర్హులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కాంగ్రెస్ నాయకులు అనుచరులు, వారి బంధువుల కోసం ప్రవేశపెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కాంగ్రెస్ నాయకుల జోక్యం లేకుండా చేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని అధికారులను కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలానే జరిగితే ఇందిరమ్మ పథకం కాంగ్రెస్ నాయకులకే పరిమితం కానుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.