Double Bedroom | మేడ్చల్, ఏప్రిల్15(నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోపు మరోసారి నోటీసులు ఇచ్చి డబుల్ బెడ్రూం రద్దుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇండ్లు లేని వారిని అప్పట్లో గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించింది. జిల్లాలోని బండ్లగూడ, రాంపల్లి, జవహర్నగర్ పరిధిలోని ఆహ్మద్గూడ, తూంకుంట, శామీర్పేట మండలం మురహరిపల్లి, ప్రతాప సింగారం, కొర్రెముల, దుండిగల్లో వేలాది సంఖ్యలో డబుల్బెడ్ రూమ్లను నిర్మించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లను అందించారు. అయితే లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లలోకి చేరకపోవడంతో చాలావరకు ఖాళీగా ఉన్నాయి.
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో 6, 203 డబుల్ బెడ్రూంలు ఉండగా.. అందులో 1500 మంది లబ్ధిదారులు మాత్రమే చేరారు. మిగతా 4500 డబుల్ బెడ్రూంలు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రతాప సింగారంలో 2 వేల మంది లబ్ధిదారులకు గానూ 1100 మంది మాత్రమే చేరారు. తూంకుంట మండలం మురహరిపల్లిలో 2,200 మంది, దుండిగల్లో 396 మంది, కొర్రెములలో 30 మంది లబ్ధిదారులు డబుల్బెడ్ రూమ్లలో చేరాల్సి ఉంది. డబుల్ బెడ్రూంలు ఖాళీగా ఉండటంతో తలుపులు, కిటికీలు విరిగిపోతున్నాయని, దీంతో ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేటాయించిన డబుల్ బెడ్రూంలను ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కేటాయించిన డబుల్ బెడ్రూంల్లోకి లబ్ధిదారులు ఈ నెల 20వ తేదీలోపు వచ్చి చేరకుంటే.. వారికి ఇల్లు అవసరం లేదని భావించి, రద్దు చేయాలని అధికారులకు సిఫారసు చేస్తామని ఇప్పటికే జీహెచ్ఎంసీ బోర్డు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.