Producer | టాలీవుడ్కు చెందిన ‘లఫూట్ గ్యాంగ్’ సినిమా నిర్మాత కే. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసుల వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి ఓ బాధితుడి నుంచి రూ.2.21 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో పాటు, నగదు కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు పలుమార్లు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, లక్ష్మీకాంత్ రెడ్డి తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ, దానిని హైదరాబాద్ సీసీఎస్కు బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318(4), సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, లక్ష్మీకాంత్ రెడ్డిపై గతంలోనే నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాజా గోల్డ్ స్కామ్ కేసుతో కలిపి ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల సంఖ్య ఐదుకు చేరినట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు.
నిందితుడి ఆర్థిక లావాదేవీలు, ఇతర బాధితులు ఉన్నారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాత అరెస్ట్ కావడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘లఫూట్ గ్యాంగ్’ చిత్ర నిర్మాతగా గుర్తింపు పొందిన లక్ష్మీకాంత్ రెడ్డి ఇప్పుడు భారీ ఆర్థిక మోసం కేసులో చిక్కుకోవడంతో ఈ ఘటనపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్లో ఉండగా, కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో సీసీఎస్ అధికారులు నిమగ్నమయ్యారు. దర్యాప్తు పురోగతిని బట్టి ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.