చర్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షీక్యాబ్ ద్వారా ఎస్సీ మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షీక్యాబ్ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు మహిళలకు డ్రైవింగ్ ప్రోగ్రాంను చేపట్టి సబ్సిడి ద్వారా వాహనాలను మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ మారుతి సుజుకీ ఆర్కేఎస్ మోటర్స్లో షీక్యాబ్ ద్వారా మహిళల కోసం చేపట్టిన డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ సామ్సన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారు రుణాలు అందించనున్నామని, అర్హులైన ఎస్సీ మహిళలు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అనంద్కుమార్, అధికారులు ఎల్డీఎం కిషోర్కుమార్, ఆర్టీఓ రవీందర్ కుమార్లతో తదితరులు పాల్గొన్నారు.