– రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు పున్నంచంద్
బూర్గంపహాడ్, ఆగస్టు 08 : చినుకుకోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద ముంచిందని, వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు పున్నంచంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో డివిజన్లో 5 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, 2,400 ఎకరాల పత్తి, 1,400 ఎకరాల వరి, 800 ఎకరాల్లో జామాయిల్, మిగిలిన 400 ఎకరాల్లో ఇతర పంటలు వరద తాకిడికి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల ప్రారంభంలో రైతులు ఇప్పటికే రెండు, మూడుసార్లు విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయారని, తాజాగా గోదావరి వరదలతో మిగిలిన పంటకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. వరికి రూ.40 వేల నుండి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారని, సంబంధిత శాఖ అధికారులు సర్వే చేపట్టి నష్టాన్ని గుర్తించి పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.