– నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
హాలియా, ఆగస్టు 08 : వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటలు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదన్నారు. ఇచ్చే కరెంటు కూడా 6 గంటలకు 6 గంటలకు మధ్య బ్రేక్ పెడుతున్నారని రైతులకు మడి కూడా తడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 12 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు దిగివచ్చి రైతులు కోరుకున్న విధంగా వ్యవసాయానికి 12 గంటల పాటు నిర్విరామంగా కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ రాస్తారోకో విరమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలవిగానీ హామీలను ఇచ్చి దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసగించడం జరిగిందని, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాశి వెళ్లి గంగా నదిలో పుణ్య స్నానం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వచ్చి వర్షం కోసం నిర్వహించే వరుణ యాగంలో పాల్గొనాలన్నారు.
రాష్ట్రంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపులను ఆన్ చేయకుండా రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులను బలి చేస్తున్నారన్నారు. మిగులు జలాల పేరుతో సీఎం రేవంత్ గోదావరి జలాలను ఆంధ్రాకు అప్పనంగా అందజేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి గోదావరి జిల్లాలను ఎత్తిపోస్తే తెలంగాణలో సగభాగం సస్యశ్యామలవుతుందన్నారు. గోదావరిలో నీళ్లు ఉన్నా కరెంట్ ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.