తాండూరు, పరిగి, చేవెళ్లలో చేపట్టిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం అవాస్తవాలు, వక్రీకరణలతో సాగింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ తాము హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ సరఫరా చేయడంలేదంటూ ఒప్పుకుంటూనే.. తెలంగాణ పథకాలపై అక్కసు వెళ్లగక్కాడు. తమ రాష్ట్రంలో 5 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నామని స్వయంగా ప్రకటించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ డీకే మాట్లాడితే అనువాదం చేసే వ్యక్తితో సీఎంగా రేవంత్ ప్రమాణం చేస్తారంటూ చెప్పించుకోవడాన్ని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు.
-షాబాద్, అక్టోబర్ 28
వికారాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : కర్ణాటకలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరా చేస్తామని హామీనిచ్చి 5 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని సాక్షాత్తు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరేందో అర్థమైంది. శనివారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి సంబంధించి కర్ణాటకలో అమలు చేస్తున్న మాదిరి తెలంగాణలోనూ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రం అంధకారం కానుందనేది చెప్పకనే చెప్పారు.
తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండగా.. 7-8 గంటలే సరఫరా చేస్తున్నారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో కనీసం 7 గంటల కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ను తెలంగాణలో గెలిపిస్తే రైతులకు కష్టాలు తప్పవనేది అర్థమవుతున్నది. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో.. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసే బీఆర్ఎస్ పార్టీ కావాలో రైతులు ఆలోచించాల్సిన అవసరముంది.
పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మొదలుకొని ప్రతీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ పథకం ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తుంటే లంచాలు ఎక్కువయ్యాయని రేవంత్రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గతంలో వ్యవసాయానికి కేవలం ఉదయం 4 గంటలు, రాత్రి మూడు గంటల కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని హామీనివ్వడం హాస్యాస్పదం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిత్యం కర్ప్యూలతో జనం భయంభయంతో బతికిన పరిస్థితులను మరిచిన రేవంత్.. మతసామరస్యాలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అనడం హాస్యాస్పదం. తెలంగాణలోని ప్రాజెక్టులు ఇతరత్రాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ వాస్తవాలను జనం ముందుంచుతున్న నమస్తే తెలంగాణపై కూడా రేవంత్రెడ్డి తన అక్కసు వెళ్లగక్కడం గమనార్హం.
తానే సీఎం అంటూ కలలు కంటుంటే ఆ పార్టీ సీనియర్ నాయకులు మాత్రం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాండూరు, పరిగిలో జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ప్రసంగం మొదలుకొని ముగిసే వరకు సీఎం సీఎం చెప్పించుకోవడం గమనార్హం. శివకుమార్ డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మాట్లాడగా.. డిసెంబర్ 9న రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్రెడ్డి అనువాదం చేయడంపై జనం నవ్వుకున్నారు.
ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి సీఎం అభ్యర్థులుగా చెప్పుకుంటున్న నాయకులతోపాటు మిగతా సీనియర్ నాయకులంతా రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పక్కనున్న కర్ణాటకతోపాటు రూ.500 ఇచ్చి బస్సు యాత్రకు తీసుకువచ్చిన జనం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించిన వెంటనే వెనుదిరిగారు. డీకే శివకుమార్ మాట్లాడే సమయానికి కనీసం వెయ్యి మంది కూడా లేకపోవడం గమనార్హం.