– ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు
బీబీనగర్, ఆగస్టు 12 : పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి మారాలని యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు. బుధవారం ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ) బీబీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం తాసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు 53 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ఆకుల శ్రీనివాస్, సప్పిడి సుధర్మారెడ్డి, బంధారపు దుర్గాప్రసాద్, బండ నర్సిరెడ్డి, డి.కుమారస్వామి, ఎస్ గీత, వి రమేష్ , సిహెచ్ ప్రకాష్, యశోదర, యామిని, జి.మమత, ఎన్ .నీనా, కల్పన, లీల, రమాదేవి పాల్గొన్నారు.