కేపీహెచ్బీ కాలనీ : ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో పారిశుధ్యం, ఇంజినీరింగ్, ఎంటమాలజీ, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులతో డీసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం కరోనా టీకా ప్రక్రియను పూర్తి చేసే దిశగా నేటినుంచి ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ టీకా ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు నోడల్ ఆఫీసర్లు, మొబిలైజింగ్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లలో 117 కాలనీలు, బస్తీలలో 1,07,828 ఇండ్లు ఉన్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో కరోనా టీకా మొదటి డోస్ వేసుకోని వారిని గుర్తించి వెంటనే వారికి మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా టీకా వేయించాలన్నారు. ఇంట్లో అందరూ కరోనా టీకా వేయించుకుంటే ఆ ఇంటికి స్టిక్కర్ అతికించాలన్నారు. కాలనీలో అందరూ టీకా వేయించుకుంటే సంపూర్ణంగా కరోనా టీకా ప్రక్రియ పూర్తయిన కాలనీగా ప్రకటించాలన్నారు.
పది రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా టీకాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రత్యేక బృందాల నేతృత్వంలో నేటినుంచి కరోనా టీకా ప్రక్రియ ప్రారంభమవుతుందని దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.