Road Accident | దుండిగల్, మార్చి 8 : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం స్కూటీని వెనకనుంచి ఢీకొట్టడంతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థి పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండలం బొప్పానుపల్లికి చెందిన కేతావత్ శంకర్ నాయక్, పార్వతీ దంపతుల కొడుకు కేతావత్ నాను (21), బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) మూడో సంవత్సరం చదువుతూ సమీపంలో ఉన్న కళాశాల వసతి గృహంలో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో కేతావత్ నాను, తన స్నేహితులైన కార్తీక్, విశ్వంత్ అనే మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఇవాళ ఉదయం 7:30 ప్రాంతంలో స్కూటీ(ఏపీ 26, బి ఈ4114)పై హాస్టల్ నుంచి బయలుదేరి ప్రగతి నగర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూటీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరగానే వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చిన గుర్తుతెలియని భారీ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న నాను ఎగిరి కింద పడటంతో అతని పైనుంచి వాహనం దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాను అక్కడికక్కడే మృతి చెందగా.. కార్తీక్, విశ్వంత్ గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
నాను మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం ఏమిటి అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఉదయం పూట కావడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విశ్వంత్ స్కూటీ నడుపుతున్నట్లు తెలుస్తుంది.