కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీసీ కళాబృందం ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం టిఎస్ఆర్టీసీ చేపట్టిన పథకాలు వివరిస్తూ ఆర్టీసీ బస్సుల సురక్షితమైన ప్రయాణాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ డిపో మాధవి ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు. మేడ్చల్ నుంచి హయత్నగర్ వరకు తొమ్మిది బస్సులు ప్రతి 30 నిమిషాలకు ఒకటి, మేడ్చల్ నుంచి ఆరాంఘర్కు మూడు బస్సులు ప్రతి గంటకు ప్రత్యేకంగా సర్వీసులను నడిపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సౌకర్యాలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్టీసీ కళాబృందం సభ్యులు, బస్సుపాస్ సెక్షన్ అధికారి ఆనంద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.