జీడిమెట్ల, సెప్టెంబర్13 : ఓ మహిళను బంధించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న కుత్బుల్లాపూర్ విమానపురి కాలనీలో ఓ ఇంటి కొనుగోలు విషయమై వాకబు చేసేందుకు వచ్చిన ఇద్దరు అగంతకులు సదరు ఇంట్లో ఉంటున్న మహిళను తాగేందుకు నీళ్లు ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు సదరు మహిళను తాళ్లతో బంధించి, నోట్లో బట్టలు కుక్కి అరిస్తే చంపేస్తామని బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు బీరువాలో ఉంచి కొద్ది మొత్తం నగదుతో పరారయ్యారు. అదే రోజు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా జీడిమెట్ల పోలీసులు, బాలానగర్ సీసీఎస్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించారు.
అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ సమీపంలోని వడ్డెర బస్తీకి చెందిన బిల్డింగ్ మెటీరియల్ సప్లయిర్ వల్లెపు శివకుమార్ (32), అదే ప్రాంతానికి చెందిన అట్టారి మురళి(39) లు దోపిడికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన బాలానగర్ సీసీఎస్, జీడిమెట్ల పోలీసులు పకడ్భందీగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి 24 గ్రాముల బంగారు లాంగ్ చెయిన్, 15 గ్రాముల బంగారు చెవికమ్మలు, చెవిమాటీలు, 12వేల నగదుతో పాటు హీరోగ్లామర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జీడిమెట్ల సీఐ పవన్ , డిటెక్టీవ్ సీఐ రామకృష్ణ, డీఎస్ఐ చంద్రశేఖర్, హెచ్సీ రాజశేఖర్, సీసీఎస్ బాలానగర్ సీఐ బాలరాజు, సిబ్బంది పోచయ్య, ఎలిజార్లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.