Sheikh Hasina : దేశ రాజధానిలో బుధవారం జరగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheik Hassina) వర్చువల్ మీడియా సమావేశం (Press Meet) తో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఇది పూర్తిగా ఒక ‘ప్రైవేట్ మీడియా సంస్థ’ నిర్వహిస్తున్న కార్యక్రమమని, అక్కడ వ్యక్తమయ్యే ఏ అభిప్రాయాలనూ భారత్ సమర్థించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.
ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC) ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంపై బంగ్లాదేశ్ తన ఆందోళనలను భారత్కు తెలిపింది. గత ఏడాది నుంచి భారత్లో ఉంటున్న షేక్ హసీనా ప్రసంగం ద్వారా ఇటీవలి ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని బంగ్లాదేశ్ భావిస్తోంది. సోమవారం బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయూన్ కబీర్, బంగ్లాదేశ్లో భారత హైకమిషనర్ దినేష్ త్రివేదిల మధ్య జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఇదే సందర్భంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్కు ఫిబ్రవరి 2026లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన కోసం ఆహ్వానం అందించినట్లు జైస్వాల్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుత బిమ్స్టెక్ (BIMSTEC) చైర్మన్ హోదాలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు అవుట్రీచ్ సెషన్కు హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు తెలిపారు. 2027లో బిమ్స్టెక్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఢాకాలో బిమ్స్టెక్ సదస్సుకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో ఈ ఆహ్వానానికి ప్రాధాన్యం ఏర్పడింది.