న్యూఢిల్లీ : లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన మిల్కా సింగ్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన చండీగఢ్ సెక్టార్ 8లోని నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. గత రాత్రి నుంచి 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంట్లోని సహాయకుల్లో ఒకరు పాజిటివ్గా పరీక్షించారని, ఈ మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆయనను చూసుకోవడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు ఓ సహాయకుడిని నియమించింది. ఆయన కుమార్తె మోనా మిల్కా సింగ్ న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ హాస్పిటల్లో వైద్యురాలు కావడంతో ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుందని నిర్మల్ కౌర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్కా సింగ్ మాట్లాడుతూ ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. బుధవారం జాగింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్గా పరీక్షించినందుకు ఆశ్చర్యపోయాను. నేను పూర్తిగా బాగున్నాను’ అని పేర్కొన్నారు.
మిల్కా సింగ్ కుమారుడు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ కొవిడ్పై పోరాడేందుకు రూ.2లక్షలు విరాళంగా అందజేశారు. ‘ది ఫ్లయింగ్ సిక్కు’గా పేరొందిన మిల్కా సింగ్ ఒలింపిక్ పతకం సాధించలేకపోయినప్పటికీ.. తన కెరీర్లో మరపురాని పోటీల్లో పాల్గొన్నారు. 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 400 మీటర్ల రేస్ అందరికీ గుర్తుండి పోతుంది. పోటీల్లో నాల్గో స్థానంలో నిలిచినా.. ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకం సాధించిన ఏకైక అథ్లెట్ నిలిచారు.