నారాయణపేట, మే 25 : ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించడంతో కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని ఎస్పీ చేతన తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 14 రోజులుగా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు అందుకు తగిన కారణాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు తెలియజేయాలన్నారు. తగిన సాక్ష్యాలను చూపకుంటే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారని ఆమె చెప్పారు. లాక్డౌన్ విధించడం ప్రజల ఆరోగ్యం కోసమే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,184 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోపాటు కరోనా వ్యాప్తి నివారణ ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్స్టేషన్ల పరిధిలో లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు.