గద్వాల, ఏప్రిల్ 20 : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరానికి చేపపిల్లల పెంపకానికి కొత్తగా పాండ్స్ నిర్మాణానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శృతిఓఝా కోరారు. కలెక్టరేట్లో మత్స్యశాఖ కమిటీ సభ్యులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపల పెంపకానికి కొత్తగా పాండ్స్ నిర్మించుకోవడానికి సొంత భూమి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి యోజన కింద వారు లబ్ధి పొందవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 12మంది లబ్ధిదారులు చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోగా ఆరుగురికి కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. నీటి పారుదల శాఖ వారు కొత్తగా పాండ్స్ నిర్మాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. మండలాల్లో ఎంపీటీసీలు ఈ నెల చివరి వరకు పని యూనిట్లను ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ మాట్లాడుతూ లబ్ధిదారులు తమ సొంత భూమిలో కొత్తగా చేపల పాండ్స్ను తవ్వించేటప్పుడు నీటి నిల్వలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం నుంచి 40శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. కేంద్రం జారీ చేసిన నిబంధనలను కలెక్టర్కు మత్స్యశాఖ అధికారి వివరించారు. సమావేశంలో జిల్లా ఇరిగేషన్ అధికారి విజయ్కుమార్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈవో ముషాయిదాబేగం, అదనపు డీఆర్డీవో సరోజ, ఎల్డీఎం రవీందర్ పాల్గొన్నారు.