సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 26 : జిల్లాలో నిర్దేశించిన ఏడువేల ఎకరాల లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్పామ్ తోటల పెంపకానికి కృషి చేయాలని రాష్ట్ర హార్టికల్చర్, సెరీ కల్చర్ కమిషనర్ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంగునూరు మండలం నర్మెటలో పర్యటించి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూన్ వరకు ఆయిల్పామ్ పంటను రైతుల నుంచి స్వీకరించేందుకు ఫ్యాక్టరీ వద్ద కలెక్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి అశ్వరావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి పంపించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యానవన, వ్యవసాయ, ఆయిల్ఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆయిల్పామ్ తోటలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ తోటల పెంపకానికి చాలా అవకాశాలు ఉన్నాయని, పామాయిల్ విస్తీర్ణంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తర్వాత 11,140 ఎకరాలతో మూడో స్థానంలో సిద్దిపేట జిల్లా ఉన్నదన్నారు.
నర్మెటలో రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నందున రైతులు పండించిన పామాయిల్ పంటకు మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో నిర్దేశించిన 7 వేల ఎకరాల్లో నూతనంగా పామాయిల్ తోటల పెంపకానికి ఉద్యానవన, వ్యవసాయ మార్క్ఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని, రానున్న రేండేళ్లలో 25 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటల సాగు జిల్లాలో జరగాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను, పామాయిల్ తోటలను ఉన్నతాధికారులు సందర్శించి పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉద్యానవన, హార్టికల్చర్ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, ఆయిల్ఫెడ్ మేనేజర్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.