‘సీబీఐ’ని ‘Caged Parrot’గా, ‘speaking in the voice of its political masters (రాజకీయ అధినేతల మాటలను వల్లెవేసేది)’గా సుప్రీంకోర్టు కొన్నేండ్ల కిందట అభివర్ణించింది. సీబీఐకి అనేకమంది రాజకీయ యజమానులున్నారని నిష్టూర సత్యం పలికింది. ప్రభుత్వమనే పంజరం నుంచి సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని కేంద్రాన్ని కోరింది. అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాం చివరి ఏడాదిలో కానీ, ఇప్పుడు మోదీ ఎని మిదేండ్ల పాలనలో కానీ పంజరంలోని చిలుకను వదిలిపెట్టలేదని జరుగుతున్న పోకడలను చూస్తే అర్థమవుతున్నది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 1963లో హోంమంత్రిత్వ శాఖ తీర్మా నం ద్వారా ఉనికిలోకి వచ్చింది. సీబీఐ అనేది చట్టబద్ధమైన సంస్థ (Statutory Body) కాదు. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత, అవినీతికి సంబంధించిన విషయాలపై దర్యాప్తు అవసరం అనిపించింది. దానికోసం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం తెచ్చి, 1946లో దాన్ని అమలుచేశారు. కేంద్ర హోం శాఖ 1963 ఏప్రిల్ 1 నాటి తీర్మానం ద్వారా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే పేరు వచ్చింది. సీబీఐ స్థాపన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా జరిగింది తప్ప చట్టం ద్వారా కాదు. ఇదే విషయా న్ని ప్రస్తావిస్తూ 2013 నవంబర్ 6న, గౌహతి హైకోర్టు సీబీఐకి చట్టపరమైన హోదా లేదని పేర్కొన్నది. దీనిపై అప్పీల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది.
సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు, దానికి ప్రభుత్వ పంజరం నుంచి స్వేచ్ఛ కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు 2021 ఆగస్టులో అనేక ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ ఎన్.కిరుబాకరన్, బి.పుగలేంధితో కూడిన ధర్మాసనం అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో సౌకర్యాలను మెరుగుపరచాలని, తద్వారా దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్కాట్లాండ్ యార్డ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) లాంటి స్థాయికి తీసుకురావాలని నొక్కిచెప్పింది.
భారత ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లాగా సీబీఐ మరింత స్వతంత్రంగా ఉండాలని కోర్టు కోరింది. సీబీఐకి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోతే సీబీఐ స్వతంత్రంగా పనిచేస్తుందని అభిప్రాయపడింది. ఈ ఉత్తర్వులన్నీ పంజరంలోని చిలుకను (సీబీఐ) విడుదల చేసే ప్రయత్నమే అని కోర్టు పేర్కొన్నది. సీబీఐకి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు వీలైనంత త్వరగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా statutory bodyగా తీర్చిదిద్ది, రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పెట్టే కేసులపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.
సీబీఐ విచారించిన కేసుల్లో 2021 నాటికి శిక్షా రేటు 60 శాతంగా ఉందని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. ఈ శిక్షా రేటు 2010కి ముందు 70 శాతం వరకు ఉండటం గమనార్హం. మద్రాస్ హైకోర్టుకు సమర్పించిన సమాచారాన్ని బట్టి సీబీఐ పెట్టిన కేసుల్లో 40 శాతం కూడా నేర నిరూపణ కాలేదు. సీబీఐ నేరారోపణ చేసినట్లయతే నేరం నిరూపించాల్సిన బాధ్యత సీబీఐపైనే ఉం టుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విషయానికి వస్తే… ఈడీ నేరం ఆరోపిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంటే ఈడీకి నేర నిరూపణ బాధ్యత ఉండదు. అందుకేనేమో ఈడీ నేర నిరూపణ రేటు అత్యంత పేలవంగా ఉన్నది.
లోక్సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి చెప్పిన వివరాల ప్రకారం 2004-14 మధ్యకాలంలో 112 సోదాలు జరిగాయి. వీటిలో రూ.5,346. 16 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.104 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ మోదీ హయాంలో 2014-22 మధ్యకాలంలో ఏకంగా 2,974 సోదాలు జరిగాయి. రూ.95, 432.08 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్లు, 839 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. మోదీ ప్రభుత్వం మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లో చేసిన మార్పులు రాజ్యంగబద్ధమా కాదా అన్న విషయాన్ని తేల్చమని 2019లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసును ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ప్రభుత్వానికి, ఈడీకి అవధుల్లేని అధికారాలను కల్పించే పీఎమ్ఎల్ఏకు చేసిన ప్రధాన సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2022 జూలై 27న తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు.
మోదీ ప్రభుత్వం పీఎంఎల్ఏకు చేసిన సవరణలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని చేసినట్లు ఉన్నాయని న్యాయ కోవిదులు అభిప్రాయపడ్డారు. ‘ఈడీ’ని, ‘సీబీఐ’ని ప్రభుత్వాలను కూల్చడానికి మోదీ ప్రభుత్వం వాడుతున్నదని రాజ్యంగ నిపుణులు భావిస్తున్నారు. నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సి, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను వదిలేసి, రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా statutory bodyగా తీర్చిదిద్ది, రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతి పత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సం స్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడు లు, పెట్టే కేసులపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.
-పెండ్యాల మంగళాదేవి