భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. 2014 లోక్సభ ఎన్నికలు మొదలుకొని నేటివరకు సోషల్మీడియా హవానే నడుస్తున్నది. ఒక హోటల్లో చీపురుకట్టతో మోదీ ఊడుస్తున్నట్టు కన్పించిన ఫొటో సోషల్మీడియాలో ఓ సంచలనం. ‘చాయ్వాలా ప్రధాని కావొద్దా?’, ‘ఏక్ బార్ మోదీ సర్కార్’ అనే నినాదాలను జనంలోకి బలంగా తీసుకెళ్లింది సోషల్ మీడియానే. ఆ తర్వాత మోదీ తన ప్రతీ మూమెంట్ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా సోషల్ మీడియా అయిన ‘X’లో తన ఖాతా తెరిచారు. అకౌంట్ తెరిచిన మొదటిరోజు 27 వేల మంది ఫాలోవర్స్ వచ్చారంటే సోషల్మీడియాపై ప్రజల్లో ఉన్న ఆసక్తి ఇట్టే అర్థమవుతుంది.
ఇన్నాళ్లు లక్షలాది మంది సోషల్ మీడి యా ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ ఇలాంటి వాటిని వినియోగించి కేసీఆర్ గురించి చాలా అంశాలు చెప్పారు, తెలుసుకున్నారు. నిందలేసిన వారు కొందరైతే ప్రశంసలు కురిపించిన వారు ఎందరో. అయితే కేసీఆర్ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఇకనుంచి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియబోతున్నాయి. ఆయనే నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వబోతున్నారు.
కేసీఆర్ గురించి, ఆయన ఆలోచనల గురించి గతంలో చిన్న సమాచారం సోషల్ మీడియాలో వస్తే గంటల్లో లక్షల వీక్షణలు వచ్చేవి. అది సెకెండ్ హ్యాండ్ సమాచారానికే. ఇప్పుడు నేరుగా ఆయనే తన అభిప్రాయాలను చెప్తున్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా అసలైన సమాచారం నెటిజన్లకు తెలియబోతున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం మిస్ కమ్యూనికేషన్ కూడా కావచ్చని భావించారు కాబోలు ఇక నేరుగా రంగంలోకి దిగారు. గతంలో క్యాడర్ గురించి కేసీఆర్ ఏమనుకుంటున్నారో తెలిసేది కాదు. పైగా ఆయన ఎవ్వర్నీ కలువరనే ప్రచారం సైతం సోషల్ మీడియాలో బాగా వైరలైంది. మంత్రులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం వెయింటింగ్లో ఉండే వారని సోషల్మీడియాలో వైరి పక్షాలు బాగా ప్రచారం చేశాయి. ఇకనుంచి ఇలాంటి సత్యాసత్య సమాచారాలకు తావు లేకుండా ఏది నిజమో అదే సమాచారం నెటిజన్లకు చేరబోతున్నదని భావించాలి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ నిరుత్సాహ పడలేదు. సరికదా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రస్తుతం ఆయన చేస్తున్న పర్యటనలను చూస్తే అర్థమవుతుంది. గత పదేండ్లుగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలపై పడిన ప్రభావాల గురించి కేసీఆర్ చాలా లోతుగా ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల ప్రధాన స్రవంతికి చెందిన ఓ టీవీ ఛానెల్లో కేసీఆర్ ముఖాముఖి తర్వాత ఆయన తెలంగాణ సమస్యల సాధన పట్ల ఎంత పట్టుదలతో ఉన్నారో కూడా ప్రజలకు మరోసారి అర్థమైంది.
ఆ రోజు ఆ ఛానల్లో వచ్చిన వీక్షకుల సంఖ్య చరిత్ర సృష్టించింది. ఈ సమాచార విప్లవ విస్తృతి వెల్లువెత్తుతున్న సందర్భంలో ఆయన యాక్టీవ్ రోల్ ప్లే చేయాలనుకున్నారేమో. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం… సోషల్ మీడియాలోకి కేసీఆర్ అరంగేట్రం ఒకేసారి జరిగాయి. ఆ నాడున్న మీడియా దాని ప్రభావం ఓ మోస్తరుగానే ఉండేది. కానీ నిక్కచ్చిగా ఉండేది. నేడు పరిస్థితి మారి పోయింది. సమాచారాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు, నిర్దేశించనూ లేరు. నిజా నిజాలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తున్నాయి. అబద్ధాలు సైతం అంతే వేగంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఒకప్పటి ప్రింట్ మీడియా, తదనంతరం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలను వెనక్కినెట్టి ఇప్పుడు న్యూ మీడియా రాజ్యమేలుతున్నది. ప్రధానంగా ఏ రాజకీయ పార్టీలు చూసినా తమకంటూ ఒక సోషల్ మీడియా వారియర్స్తో ఒక వింగ్ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రజల్లోకి తమ ప్రభుత్వ లేదా పార్టీ విధానాలను ఎంత మేర తీసుకువెళ్లాలో చెప్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో వాళ్లతో ప్రత్యేకంగా సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికలో 4.5 మిలియన్ల ఫాలోవర్స్తో నిత్యం ట్వీట్లు చేస్తూ అగ్రస్థానంలో ఉండగా, అసదుద్దీన్ ఓవైసీ, హరీశ్రావు, కల్వకుంట్ల కవితలు రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా రాజకీయ నాయకులందరూ సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని ప్రత్యర్థులపై పంచులు, పదునైన మాటలతో అస్ర్తాలను ఎక్కుపెడుతున్నారు. తాము చెప్పాలనుకున్న విషయాలను బహిర్గతం చేస్తున్నారు.
తాజాగా కేసీఆర్ సోషల్ మీడియాను వేదికగా చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు, ఫాలోవర్స్ సంబురంలో తేలియాడుతున్నారు. చేసింది చెప్పుకోకపోవడం, చేయాలనుకున్నదాన్ని వివరించకపోవడం తప్పు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నడిచే దారిలోనే తాను నడవాలని భావించిన కేసీఆర్ నిర్ణయం పట్ల ఇటు పార్టీలో, అటు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. కోట్లాది మందిని ప్రభావితం చేసే కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు సోషల్ మీడియాలో ఉంటే తనకు, రాష్ర్టానికి సంబంధించిన వాస్తవ సమాచారం ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది. తనపై జరిగే అవాస్తవాల కట్టడికి కూడా ఇది మంచి మార్గమే. ఏదేమైనా సోషల్ మీడియాతో ఉంటే అనుక్షణం ప్రజలతో ఉన్నట్టేనని రాజకీయా నాయకులు భావిస్తున్నారడంలో అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
అస్కాని మారుతీసాగర్
90107 56666