ఈ ఏడాది జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించేందుకు ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న అపారమైన ప్రజాదరణపైనే పాలక భారతీయ జనతా పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. కానీ, ఓటింగ్ శాతం తగ్గితే ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో తొట్రుపడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదేండ్ల క్రితం నమోదైన 69 శాతంతో పోలిస్తే.. శుక్రవారం నాడు జరిగిన రెండో దశ పోలింగ్లో 65 శాతం ఓటింగ్ నమోదైంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ బలంగా ఉన్న అనేక రాష్ర్టాల్లో ఈ విడదలో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో నమోదైన 69 శాతంతో పోలిస్తే.. మొదటి దశలో కూడా దాదాపుగా 65 శాతమే పోలింగ్ నమోదైంది. తొలుత అంచనా వేసినట్టుగానే ప్రారంభ దశలో ఓటర్లు తక్కువగా ఉత్సాహం చూపినట్టు స్పష్టంగా కనిపించింది.
ఒక సర్వ సమగ్రమైన జాతీయ ప్రచారాంశం (నెరేటివ్) అనేది లేదని స్వతంత్ర రాజకీయ విశ్లేషకులు, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు. పాలకపక్షం లేదా పోటీలో అందరికంటే ముందున్న పార్టీని కాస్త తొట్రుపడేలా చేసే పలు కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఒకే అంశంపై ఎక్కువగా ప్రచారం జరిగితే పోటీలో ఉన్న అగ్రగామి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు.
అయితే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, అంశాలపైనే ప్రచారం జరుగుతున్నదని, అందులో స్థానిక నాయకుల నాయకత్వ పటిమ తుది ఫలితంలో తేడాను చూపుతుందని ముఖోపాధ్యాయ చెప్పారు.
ఎండల వల్ల కొంతమంది ఓటర్లు రాకపోవడం, బీజేపీ మద్దతుదారుల్లో ఎటూ గెలుస్తామనే ధీమా అందుకు కారణమని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉన్నందున, ప్రధాని పదవికి అభ్యర్థిని ఇప్పటికీ గుర్తించనందున అధికార పార్టీ తిరిగి గద్దెనెక్కడం ఖాయమని వారు నమ్ముతున్నారు.
భారత్లోని కశ్మీర్లో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని బాలాకోట్పై వైమానిక దాడి చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో 2019 ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి ఘనంగా మద్దతు పలికారని ముఖోపాధ్యాయ తెలిపారు. అవినీతి, మహిళల భద్రత సంబంధిత సమస్యలపై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఓటర్లు కోపం పెంచుకున్నారు. ఆ కారణంగా 2014లో మొదటిసారి మోదీ విజయం సాధించారు. ఆ తర్వాత బాలాకోట్ అంశం రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీకి తోడ్పడిందని నిర్ధారణ అయింది. అయితే ఈ ఎన్నికలు 2014, 2019 కంటే పూర్తిగా భిన్నమైనవని ముఖోపాధ్యాయ చెప్పారు.
కానీ, ముందస్తుగా వస్తున్న సంఖ్యలపై అతిగా అంచనా వేయకూడదని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే, ‘బీజేపీకి అనుకూలంగా ఇప్పటికీ సైలెంట్ వేవ్ ఉండొచ్చు. ఆ వేవ్ వెంటనే స్పష్టంగా కనిపించదు’ అనేది ఆయన అభిప్రాయం. బీజేపీ ఇప్పటికీ మెరుగైన స్థితిలోనే ఉండొచ్చని, కానీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేమని ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ సమాజంపై దాడి చేయడం, మెజారిటీ వర్గమైన హిందువులను ఆకర్షించేందుకు మళ్లీ తమ సాంప్రదాయ పద్ధతులకు మళ్లడం ఇదే సూచిస్తున్నదని చెప్పారు.
ముస్లింలు చొరబాటుదారులు అని, ఎక్కువ మంది పిల్లలు గలవారని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు తమ సంపదను పంచుతుందని పశ్చిమ రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రజలను హెచ్చరించడం సోషల్ మీడియాలో గతవారం వైరల్గా మారిన వీడియోలో చూడవచ్చు.
కాంగ్రెస్ నేతృత్వంలోని శక్తివంతమైన ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న మోదీ-బీజేపీ గెలవడం ఖాయమని అనేక మంది విశ్లేషకులు అంచనా వేశారు. తమ మద్దతుదారుల ఓట్లు చీలకుండా ఉండేందుకు అనేక నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను కూటమి రంగంలోకి దించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హిందూ ఓటర్ల బలమైన మద్దతుతో 37 శాతం ఓట్లను సాధించిన బీజేపీ లోక్సభలోని 545 సీట్లలో 303 స్థానాలను గెలుచుకున్నది. పార్లమెంట్లో మెజారిటీ సాధించాలంటే లోక్సభలోని కనీసం సగం సీట్లు లేదా 272 సీట్లను గెలవాలి.
ఓటింగ్ శాతం తగ్గడం వల్ల బీజేపీ ఓడిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని సీ-ఓటర్ సంస్థ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ చెప్పారు. ఓటింగ్ శాతం తగ్గడమనేది నియోజకవర్గాల వారీగా ప్రభావం చూపుతుందని అన్నారు. ఐదేండ్ల కిందటితో పోలిస్తే.. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలను పెంచాయి.
గట్టి పోరాటానికి అవకాశముంది…ఉత్తర భారత్లోని ఉత్తరప్రదేశ్లో కూల్చివేసిన మసీదు ప్రాంగణంలో రామాలయ నిర్మాణాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం పట్ల హిందూ ఓటర్లలో ఉత్సాహం మోదీ-బీజేపీ అధికారంలో కొనసాగుతాయనే అంచనాలను మరింతగా పెంచింది.
ఉత్తరప్రదేశ్లో ఇటీవల పర్యటించిన రాజకీయ విశ్లేషకురాలు స్మితా గుప్తా.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మతపరమైన అంశాలు ఓట్లను తెచ్చిపెట్టే అవకాశాలు సన్నగిల్లాయని చెప్పారు. అటువంటి అంశాలు తమ జీవితాలను మెరుగుపరుస్తాయా? ఉద్యోగాలు సంపాదించి పెడతాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారని స్మితా గుప్తా తెలిపారు. చాలా మంది బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, అయితే వారు ప్రతిపక్షాల పట్ల ఉత్సాహంగా ఉన్నారని దానర్థం కాదని, బీజేపీ మెజారిటీని తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తనకు అర్థమైందని స్మితా గుప్తా అన్నారు. ‘హిందూ-ముస్లింల మధ్య అంతరం తొలగిపోలేదు. కానీ, దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దాని స్థానంలో కులం మళ్లీ ప్రధాన అంశంగా మారింది’ అని గుప్తా చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని సాంప్రదాయిక ఓటింగ్ ధోరణులను ప్రస్తావిస్తూ.. కొన్ని వర్గాలవారు తమ సొంత కులాలకే ఓటు వేయడానికి ఇష్టపడతారని ఆమె పేర్కొన్నారు.
ఓటరు నిరుత్సాహానికి ప్రధాన కారణాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండటమని, బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇస్తే.. కుల ఆధారిత ఉద్యోగ రిజర్వేషన్లను తొలగిస్తుందని లేదా తగ్గిస్తుందనే భయం ప్రజల్లో కనిపించినట్టు ఆమె అన్నారు. నిరాదరణకు గురైన కొన్ని కులాలు, తెగలకు.. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లోని సీట్లలో కొంత భాగాన్ని భారత రాజ్యాంగం రిజర్వ్ చేసింది. తనకు అంతగా ఆదరణ లేని ప్రాంతాలకు ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలకు విస్తరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సీట్లు గెలుచుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
‘అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా పోలింగ్ శాతం తగ్గడం గురించి ఆందోళన చెందాల్సిందే. అలా తగ్గడం అనేది పార్టీకి ఉపయోగకారిగా ఉండదు. కానీ, పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఇలాంటివి ఎదురుకాక తప్పదు’ అని రాజకీయ విశ్లేషకుడు హరీశ్ రామస్వామి అన్నారు. ఒకే వ్యక్తిపై (మోదీ) అధికంగా ఆధారపడటం వల్ల ప్రతికూలతలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. ‘ఒక్కరే అన్ని చేయగలరని మీరు అనుకుంటున్నారా?’ అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
బీమన్ ముఖర్జీ