రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే అనుకుంటున్న సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఛానల్కు నాలుగు గంటలకుపైగా సమయాన్ని కేటాయించి ఓ అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత పాలకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ పటాపంచలైపోయాయి. అంతేకాదు, ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అసలు చర్చను పక్కదోవ పట్టించడానికే బీఆర్ఎస్, కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నదని, వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైపోయింది.
ఏప్రిల్ 24, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మిర్యాలగూడలో కేసీఆర్ బస్సుయాత్ర మొదలైంది. అబద్ధపు హామీల పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు పడుతున్న గోసను చూడలేక ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఈ యాత్రను ప్రారంభించారు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు 24 పట్టణాల్లో 17 రోజుల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న నాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని అర్థమైంది.
రైతులు, మహిళలు, ఆటో కార్మికులు, విద్యార్థులు, వృద్ధు ల నుంచి మొదలుకొని అన్నివర్గాల ప్రజలు ఉద్యమ నాయకుడికి తమ బాధలను చెప్పుకోవడం గమనించాను. నీరు లేక మా పంటలు ఎండిపోతుంటే మేమెలా బతికేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు? రాష్ట్రంలో పండిన పంటను కొనే పరిస్థితి లేదంటే ఇంకా బోనస్ ఎక్కడిది? డిసెంబర్ 9వ తేదీనాడే చేస్తామన్న రుణమాఫీ ఇంకా అమలుకు నోచుకోలేదు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నా, ఆ హామీ ఊసే లేదు.
24 గంటల నిరంతర విద్యుత్తు లేక మోటర్లు కాలిపోతున్నాయి. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే రాష్ట్రంలో మళ్లీ దాపురించాయని ప్రజలు కేసీఆర్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరిశ్రమల్లో జనరేటర్ల శబ్దం మళ్లీ వినపడుతున్నది. వీధుల్లో తాగునీటికి కటకట మళ్లీ మొదలైంది. ప్రతి ఊరిలో ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లు కనుమరుగయ్యాయి. కేసీఆర్ కిట్ కానరావడం లేదు. 102 సేవలు అందడం లేదంటూ ప్రజలు కేసీఆర్కు విన్నవించుకుంటున్నారు. ఇక ఆటో డ్రైవర్లయితే తమ పరిస్థితి అయితే మరి అధ్వాన్నంగా తయారైందంటూ వాపోయారు.
రేవంత్రెడి తమను నిండా ముంచారని, మెగా డీఎస్సీ అని తమను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని నిరుద్యోగ యువతీ యువకులు ఫిర్యాదయ్యారు. మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, హాస్టళ్లలో కనీస వసతులు లేవని, కలుషిత ఆహారంతో గురుకుల విద్యార్థుల మరణాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు చెప్పారు. దళితబంధు అనే బృహత్తర పథకం ద్వారా గత ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేస్తే, కాంగ్రెస్ తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామన్నది. రూ.12 లక్షలేమో గానీ రూ.12 వేలు కూడా ఇవ్వడం లేదని దళిత మహిళలు కేసీఆర్ వద్ద బోరుమన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొంటే ‘మేం లంకె బిందెల కోసమే అధికారంలోకి వచ్చాం’ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఐదు నెలలు కావస్తున్నది. అయినా ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధిచెప్తామని ప్రజలు బల్లగుద్ది చెప్తున్నారు. తెలంగాణను ప్రేమించే వ్యక్తి ఒక్క కేసీఆరేనని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతామని ప్రజలు చెప్తున్నారు. బస్సుయాత్రకు వస్తున్న విశేష స్పందనే అందుకు మంచి ఉదాహరణ.
తుంగ బాలు
99859 30246