Yadagirigutta | యాదగిరిగుట్ట, మే 2 : పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైటీడీఏ దివ్య విడిది (ప్రెసిడెన్సియల్ విల్లా)లో మాంసాహార భోజనం కలకలం రేపింది. గురువారం దివ్య విడిది కాటేజీలోని ఆడిటోరియంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
మధ్యాహ్నం జెన్కో విల్లాలో దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా చికెన్తో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది చూసిన కొంతమంది ఉపాధ్యాయ సంఘం నాయకులు అవాక్కయ్యారు. పవిత్ర పుణ్యక్షేత్రం పరిధిలో చికెన్ పెట్టడమేంటని విస్తుపోయారు. వైటీడీఏ అధికారులతో మాట్లాడితే దివ్య విడిది పేరుతో ఆడిటోరియాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు ఇస్తున్నామని తెలిపారు. చికెన్ వడ్డించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మాంసాహారాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.