‘ Agriculture is our culture’ అని ఘనంగా చెప్పుకునే దేశంలో 13 నెలల పాటు రైతులు నిరసనోద్యమం చేయాల్సి వచ్చింది. దేశమంతా ఒకే ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’ ఉండాలని ఉద్యమానికి పూనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మరెన్నో అంశాలలో దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్నారు.
తెలంగాణకు నేడు పండుగ రోజు. 21 ఏండ్ల కిందట పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మంత్రి కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే.. ‘మేజర్’ అయింది ఇప్పుడే. దేశంలో పేరెన్నికగన్న పాలకులు, ఉద్యమ నాయకులు, సామ్యవాద భావజాలం కలవారు, ఆధ్యాత్మిక సుసంపన్నత ఉన్నవారు ఎందరోఉన్నారు. కానీ.. ఇందరూ ఒక్కడిగా ఉన్నది మాత్రం ఒక్క కేసీఆర్ రూపంలోనే! ఆయన మార్గదర్శనంలో నవనవోన్మేషంతో తొణికిసలాడుతున్నది టీఆర్ఎస్. అందుకే ఈరోజు ఇంత సంబురం!
మోదీ భుజం మీద చేయివేసి దర్పాన్ని ప్రదర్శించిన అంబానీని గతంలో చూసినం. ఇపుడు ఏకంగా బ్రిటన్ ప్రధానితో మోదీ ప్రమేయం కూడా లేకుండా చర్చలు జరుపుతున్న అదానీని చూస్తున్నాం. ఇది దేశాన్ని పూర్తిగా ఒకరిద్దరు గుజరాతీల దోపిడీకి వదిలేయడమే.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి పుట్టిన టీఆర్ఎస్, ఆ క్షణం నుంచే ఎన్నో కడగండ్లను ఎదుర్కొన్నది. అనేక రకాల అవరోధాల్ని అధిగమిస్తూ, దారిలో ముళ్ళు పరిచే శక్తులను మట్టికరిపించే కృష్ణుడి ప్రస్థానం లాగే సాగింది టీఆర్ఎస్ ప్రస్థానం. రామాయణ, భారత వీరులలాగే పదునాలుగేండ్ల క్షేత్రకర్మల అనంతరం పట్టాభిషిక్తమైన టీఆర్ఎస్ ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి-సంక్షేమాల జోడు స్వారీతో సుస్థిర, సమర్థ పాలన అందిస్తున్నది.
అన్నిరకాల అభివృద్ధి సూచీలలో, భావసంపన్నతలో, భవిష్యత్ దృష్టిలో అట్టడుగున కునారిల్లుతున్న యూపీ, గుజరాత్లు మనకు పాఠాలు నేర్పాల్సిన పని లేదు. హైందవం గురించి ఐనా, హిందుస్థాన్ గురించి ఐనా మనకు చెప్పే స్థాయిలో ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీ లేదు. మునుపెవరికీ లేనంత తపనతో, దార్శనికతతో, స్థిర సంకల్పంతో దేశాన్ని సమున్నతంగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ ఇప్పుడు ‘టార్చ్ బేరర్’ కావాల్సి ఉంది. పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు ఈ మహత్తర లక్ష్యాన్ని గుర్తించాలి. అధినాయకుడిని అనుసరించాలి. ‘మేజర్’గా అత్యంత బాధ్యతతో మెలగాలి. ఎందుకంటే… దేశం నిజంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఈ ఎనిమిదేండ్ల పాలనలో చెప్పినవీ, చెప్పనివీ చేసి చూపించిన విధానాలు, పథకాలు అన్ని కూడా రాజ్యాంగం చెప్పిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం ప్రోదిచేసేవే. ఒక్కమాటలో టీఆర్ఎస్ పాలన అంటేనే రాజ్యాంగ హక్కులు ప్రజలకు అందించడం. అలాంటి రాజ్యాంగాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కడం వల్ల… అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మోదీ రాజ్యాం గం అమలు అవుతుండటం వల ్లజరిగే దారుణాలు సహించలేకనే ‘రాజ్యాంగంపై చర్చ జరగాలి’ అని కేసీఆర్ అంటున్నరు.
రాష్ర్టాలపై కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల రాజ్యాంగం హామీ పడ్డ జాతీయ ఐక్యత, సమగ్రతకు నేడు భంగం వాటిల్లుతున్నది. ఏ ఒక్క రాజ్యాంగబద్ధ వ్యవస్థనూ గౌరవించకపోగా, వాటిని తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి నిర్లజ్జగా వాడుకుంటున్నది మోదీ ప్రభుత్వం. రాష్ర్టాల్లో ప్రజాతీర్పుతో కొలువైన బీజేపీయేతర ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఆక్రమించజూస్తున్నది. నామినేట్ అయిన గవర్నర్కు కోట్లాది ప్రజల సంకల్పాన్ని నిర్లక్ష్యం చేసేంత అధికారాలు ఉండటం దేశానికి మంచిది కాదు.
దీనికి విరుగుడు ఏమంటే.. రాష్ర్టాల్లో బలమైన పార్టీలు, నాయకులు ప్రజాస్వామిక మార్గాలలో ప్రజలను సమీకరించడం ద్వారా ప్రాంతీయ గౌరవాన్ని నిలబెట్టవచ్చు, రక్షించవచ్చు. తద్వారా జాతీయ ఐక్యత సాధించవచ్చు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇందులో ముందంజలో ఉన్నది. బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీలాంటి రాష్ర్టాలతో సహా దక్షిణాది కూడా బలం గా ఈ ‘ఫెడరల్ విఘాతం’ పట్ల గొంతు కూడదీసుకుంటున్నది. రాష్ర్టాలలో పార్టీలు ఏవైనా, రాజకీయ అవగాహనలు, అవసరాలు ఎట్లున్నా… కేంద్రం పెత్తనాన్ని నిలువరించక పోతే ఆయాపార్టీలకే కాదు రాష్ర్టాల ఉనికికి కూడా అర్థం లేకుండా పోతుంది.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు అయినా ఇంకా భారతదేశం అభివృది ్ధచెందుతున్న దేశంగానే ఎందుకు ఉన్నది? అతి చిన్న దేశాలు కూడా మన కంటే ఎందుకు ముందంజలో ఉన్నా యి? భూభాగంలో చైనాకు దాదాపు సమానంగా ఉన్న మనం అభివృద్ధిలో చైనాకు ఎందుకు అల్లంతదూరంగా ఉన్నాం?
‘సంపద సృష్టి అమోఘం- సంపద పంపిణీ మాత్రం శూన్యం’గా ఉన్నది భారత్ పరిస్థితి. ఈ దేశ శ్రామికులు చెమటోడ్చి సృష్టించిన సంపద ఒక డజను మంది దగ్గరే పోగు పడుతున్నది. ప్రభుత్వ విధానాలు అట్లా ఉండటం కాదు, వారికోసమే ప్రభుత్వం పని చేస్తున్నది.
మోదీ ప్రభుత్వ ఈ అపసవ్య ఆర్థిక విధానాలు,క్రోనీ కాపిటలిజంను భరించలేక రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, అరవింద్ పనగరియా, అరవింద్ సుబ్రమణియన్ లాంటి ఆర్బీఐ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు, ప్రధాని ఆర్థిక సలహాదారులు తమ పదవీకాలం ముగియక ముందే రాజీనామాలు చేసి తమ నిరసన తెలిపారు. వీరంతా మోదీ మెచ్చి, తెచ్చి పెట్టుకున్నవారే. అయినా భరించలేనంత ఆర్థిక అరాచకాన్ని వారు తట్టుకోలేక పదవులకు రాజీనామాలు ఇచ్చి మోదీ ప్రభుత్వానికి దూరం జరిగారు.
నరేంద్రమోదీ పాలన ప్రజలకు ఏమీ ఇవ్వలేదా అంటే, ఇచ్చింది. 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిరుద్యోగం, 30 ఏండ్లలో లేనంత ద్రవ్యోల్బణం, ఎన్నడూ లేనట్టుగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ఇచ్చింది.
మరి తెలంగాణ? దేశానికే దిక్సూచిగా ఉంది. మన ‘రైతు బంధు’ పది రాష్ర్టాల్లో అమలవుతున్నది. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్రప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు దాని అమలు కోసం పథకాలు రచిస్తున్నై. ప్రపంచంలోనే భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మనకు కలికి తురాయి. పారిశ్రామీకరణ, వ్యవసాయం, ఐటీ, పర్యావరణ రంగాలలో పారదర్శక విధానాలతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నది తెలంగాణ. జీవన ప్రమాణాల మెరుగుదలకు అత్యవసరమైన నాణ్యమైన విద్య, వైద్యం కల్పనలో మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నది. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లా ‘దళిత బంధు’ దళితుల జీవితాలకు ఊతకర్ర అవుతున్నది. 80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది.
ఇంతటి ఘనతలకు కారణం ఏమంటే… విద్య మన మతం; విద్వేషం వారి (బీజేపీ) అభిమతం. సేద్యం, వైద్యం మన సంకల్పం; మోసం, ద్రోహం వారి సిద్దాంతం. ఉపాధి, సంక్షేమం మన అజెండా; కక్షలు, కార్పణ్యాలు వారి మది నిండా. పెట్టుబడుల సాధన మన మిషన్; పాపకార్యాలు వారి విజన్. ఆధ్యాత్మికం మన ఆత్మ; దేవుడి పేర రాజకీయం వారి క్షుద్రతత్వం!
మన దేశ దశ, దిశ మారాలంటే, బీజేపీ ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి అధికారంలోకి రాకూడదు. దేశ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ నేతృత్వంలోనే దేశ పురోగతి సాకారం కాగలదు. అన్నిరాష్ర్టాలను దాటుకొని స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థికవృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాష్ట్రమంతటా సమగ్రంగా కనిపిస్తున్నది. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే మనం సగర్వంగా అంటున్నాం… ఈ మోడల్ దేశావ్యాపితం చేద్దామని. దార్శనికత ఉన్న నాయకుడు, ఎనిమిదేండ్లలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం. ఆయన నేతృత్వంలోనే జాతీయ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి, సంక్షేమం సుసాధ్యం!
చివరగా… తెలంగాణ సమాజానికి ఒక విన్నపం. పక్కనే ఉన్న కర్ణాటకను నాశనం చేసిన బీజేపీ మనను కూడా ముంచజూస్తున్నది. Religion is a way of life. Religious politics are away of life అన్నది గుర్తించగలిగే చైతన్యం ఉన్న మనముందు వారి కుప్పిగంతులు సాగనివ్వవద్దు. దేశ రక్షణ ఇప్పుడు మన కర్తవ్యం. తెలంగాణ పాత్ర అందులో ముఖ్యం. వ్యక్తులుగా మనందరి భాగస్వామ్యం అవశ్యం! టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా మనమంతా పునరంకితం అవు దాం. పార్టీతో సంబంధంలేని వ్యక్తులు అంటూ ఎవరూ లేరు, ఎందుకంటే ఇది తెలంగాణ సొంత పార్టీ! జైతెలంగాణ.. జైభారత్.
-శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371