ఒకరినొకరు రక్షించుకోవటానికి.. విలువలను భక్షించుకోవటానికి జరుగుతున్న తాంత్రిక యుద్ధం. ప్రజలపై మంత్రప్రయోగం జరుగుతున్నది. చెరసాలలో ప్రజలను వేసి ఉపన్యాసాల కొరడాతో ఫడేల్ ఫడేల్మనే శబ్దతరంగాల ప్రయోగం జరుగుతున్నది. ఆ తరంగాలకు న్యాయబద్ధతో.. హేతుబద్ధతో ఏమీలేదు. ఆ గంటకు ఆ ఆటను రక్తి కట్టించాలి. అవసరమైతే ఒంటిమీద ఉన్న ఒక్కొక్క వస్ర్తాన్ని విప్పుతూ చిందులేయాలి. ఆ పిచ్చిగంతులను చూసి వెర్రిజనం ఈలలు.. కేకలు.. కేరింతలు.. పెడబొబ్బలు పెట్టాలి. ఆ దృశ్యాలను చూసి పులకించి పోవాలి. అవును. నిజం. అదే కదా జరుగుతున్నది!
బాధ్యతలున్నవారే బాధితులుగా మారినట్టు. పరిష్కరింవలసిన వారికే సమస్యలు ఎదురైనట్టు గుడ్డివాదం ఒకటి ప్రజల ముందుకు వస్తున్నది. దాన్నేవారు అందరిముందు పెడుతున్నారు. తాళిబొట్లు తాకట్టు పాలవుతాయనే హెచ్చరికలు. మనింట్లో పక్కింటివాడు నిద్రిస్తాడనే భ్రమలు. కంటి మీద కునుకు లేకుండా చేస్తారనే భయాలను సృష్టించటమే ఆ మెదళ్ల.. ఆ నాలికల టక్కుటమార దస్తావేజుల చిట్టా. అలాంటి గడుసు దయ్యాలు కళ్లముందు నాట్యమాడుతుంటే బుద్ధిమంతుల సుద్దులు ఎవరికి కావాలోయ్? తప్పు చేస్తున్నామని, తప్పుగా మాట్లాడుతున్నామని తెలియని ప్రసంగీకులు.. అదీ బాధ్యత గల కుర్చీని (గల్లీ అయినా… ఢిల్లీ అయినా) అస్త్రంగా (ఆలంబన ఇక గతం) ధరించిన వాళ్లు చెప్తున్నప్పుడు.. ఆ చెప్తున్నది.. చెప్పేదీ నిజమే కానప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అనే దానికన్నా ‘నేను సృష్టించే వశీకరణ తాం త్రిక ‘మైక్’హిత మాంత్రిక బలంతో నావైపు రావాల్సిం దే.. నన్ను బలపరచవలసిందే.. నాకు భయపడ వలసిందే’ అనే కదా హుంకరింపు. అదే మనపట్ల వారికున్న అమోఘ వాత్సల్యపూరిత గీతామృతం.
నిజాన్ని నమ్మించలేనపుడు అబద్ధమనే ఆయుధాన్ని ఆశ్రయించాలి. అదే ఈ ప్రజలకు అసలైన శిక్ష. ఎన్నిక ఎన్నికకూ ఈ శిక్ష తీవ్రత పెరిగిపోతున్నది. అందులో భాగంగానే రాజ్యాంగం రాద్ధాంతమైంది. హక్కులు భగ్నమయ్యాయి. కాళోజీ ‘పీకనొక్కు’ సిద్ధాంతమే చెలామణి అవుతున్నది. కుర్చీలు అదే కోరుకుంటున్నాయి. ‘నాకు నచ్చింది నువు చేయలేదనుకో…నీకు నచ్చనిది నేను చేసేస్తాను అంతే’ అనేరీతిలో హుకుంలు జారీ అవుతూనే ఉంటాయి. అదే అసలైన ఎంపికగా నిట్టూర్పు ఒకటి సాగిలపడుతుంది.
‘దోచినవాళ్లదే ఘనత. దాచుకోవాలనుకునేవాళ్లదే భవిత’ అనే తాత్విక భూమికపై కుర్చీలు కుతూహలపడుతున్నాయి. వాటికి ఉచితానుచితాలతో పనిలేదు. న్యాయాన్యాయాలతో పేచీలేదు. అదే నీతివంతమైన దారి. అవినీతి అంతమైందని పుంఖాను పుంఖాల ప్రకటనలు వెలువడతాయి. చూపుడువేలు కొసను సిరామరకలు ఐదేండ్లకోసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వాదన. బలాన్ని మరింత కూడగట్టేందుకు యుద్ధక్షేత్రంలో నాల్కలు పోటీపడుతున్నాయి.
ఇటువంటి సమయంలో ఒక ‘రక్ష’ణరేఖ గీస్తే ఎంతబాగుంటుంది? ‘ఈ రేఖ దాటితే నువు భస్మీపటలం అయిపోతావ్’ అనే హెచ్చరిక ఒకటి ఆకాశమార్గన వినపడితే ఎంతబాగుంటుంది? ‘దేశమంటే మట్టికాదోయో…దేశమంటే మనుషులోయ్’… చిలుముపట్టిన నినాదమైపోయి.. ‘మనుషులంటే జీవచ్ఛవముల్’ అని కదా చదువు‘కొన’ వలసివస్తున్నది. అది త్వరలోనే మరోసారి నిరూపితం కావటానికి, ఈవీఎంల్లోకి ఐదేండ్ల రక్తాశృవులుగానో.. భవితాశృవులుగానో చిందేందుకు బొటనవేలు సిద్ధం అవుతున్నది. అయ్యో.. శిలక్కొయ్యకు వేలాడుతూ ఇంకా ఎంతకాలం ఉంటావు? ‘కండ్లముందు జరుగుతున్నదంతా చూస్తూ ఉండటానికి కర్మసాక్షిని కాదు.. సాక్షాత్తూ మానవుణ్ని’ అని ఛటాల్న చర్నాకోలాతో చరిచి గుడ్లు ఉరిమే కాళోజీ పిడికిలిని ఒక్కసారి దర్శిస్తే ఎంతబాగుండు?
నూర శ్రీనివాస్