తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుంటే 39.40 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్ 64 సీట్లు దక్కించుకున్నది. 37.35 శాతం ఓట్లతో బీఆర్ఎస్ 39 స్థానాలు పొందింది. రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా 2.05 శాతం మాత్రమే. వ్యాసం ప్రారంభంలోనే ఈ మాటలను ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తున్నదంటే… బీఆర్ఎస్ ఏ అధికారంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తుండంతో ఈ వాస్తవాన్ని గుర్తుచేయాల్సి వస్తున్నది. ప్రజలు ఇచ్చిన అధికారంతో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా విధులు నిర్వర్తిస్తున్నదని చెప్పడమే దీని సారాంశం. కేవలం 2 శాతం ఓట్లు తగ్గినంత మాత్రాన బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారనో, శిక్షించారనో అనుకోవడం తగదు. ఉద్యమ పార్టీగా చూశారు.. అధికార పక్షంగా చూశారు… ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రజలు అప్పగించిన పనిని చేస్తుంటే దానిపై కామెంట్లు ఎందుకు?
ఆర్థికమంత్రిగా ఆయనకున్న అనుభవంతో రుణ మాఫీకి మొత్తం రూ.39 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా సేకరిస్తారు? అసలు రుణమాఫీకి రిజర్వ్బ్యాంక్ ఎంతవరకు అంగీకరిస్తుంది? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఇలా చర్చకు వచ్చే అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. వీటిపై ఇంతవరకు ఎలాంటి పేపర్ వర్క్ జరగలేదు కాబట్టే పంద్రాగస్టు నాటికి రుణమాఫీ అమలు చేయలేరని హరీశ్రావు అంత గట్టిగా చెప్తున్నారు. ఆ రోజున జెండా ఎగురవేసి ఏదో మొక్కుబడిన ఒకరిద్దరు రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేస్తే కుదురుతుందా? అది మాటను నిలబెట్టుకోవడం అవుతుందా?
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏం చేస్తున్నదంటే? ముఖ్యమైన మూడు పనులు నిర్వర్తిస్తున్నది. ఒకటి.. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, రెండు.. ఈ సమస్యల పరిష్కారానికి అర్థవంతమైన సూచనలు ఇవ్వడం, మూడు.. అధికార పక్షం చేసిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసి అవి అమలయ్యేలా ప్రజలతో కలిసి పోరాటం చేయడం. ఇది తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ బాధ్యత. ఈ పోరాటం చేస్తున్నందుకే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్రావుపై అధికారపక్షం దాడి చేస్తున్నది. రాజీనామా చెయ్ అంటూ సవాలు విసిరింది. హరీశ్రావుకు రాజీనామాలు కొత్త కాదు, అధినాయకుడు కేసీఆర్ వెంట తెలంగాణ విముక్తి కోసం గడ్డిపోచల వలె ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన నాయకుడు హరీశ్రావు. ఒక్కసారి కాదు, పలుమార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. మరోసారి కాదు, ఇంకా ఎన్ని సార్లయినా తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసే నాయకుడు హరీశ్రావు. రాజీనామా ఒక లెక్క కాదు, ఆయనకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. అందుకే హరీశ్రావు రైతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఇంతకూ ఆయనేం చేశారు? రాష్ట్రంలో కరవు నెలకొన్నందున తక్షణ సాయం కింద కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న రుణమాఫీని అమలుచేస్తారా? క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇస్తారా? అని ప్రశ్నించారు. రైతులతో పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పింది. అక్కడితో పని ముగిసిందనుకుంటే ప్రతిపక్ష నాయకుడు, అందులో ఉద్యమకారుడు ఎందుకవుతారు? ఇది కల్లబొల్లి మాటేనా? నిజంగా చేస్తారా? అని మళ్లీ ప్రశ్నించారు. తప్పకుండా చేస్తాం… చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తారా అని ముఖ్యమంత్రే అడిగారు. ఆ తేదీనాటికి ఇవ్వలేరు.. ఒకవేళ ఇస్తే రాజీనామా చేస్తా.. ఉప ఎన్నికలు వస్తే మళ్లీ పోటీ చేయను.. ఇదిగో రాజీనామా పత్రం అంటూ అమర వీరుల సాక్షిగా తెలిపారు. ఇది రాష్ట్రంలో సంచలనం కలిగించింది. దీనిమీద అధికారపక్షం విమర్శలు, వ్యాఖ్యానాలు, సవాళ్లు చేస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హామీలను స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అమలు చేయలేదని, ఒకవేళ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటిస్తూ మాట్లాడారు.
ముందుగా రుణమాఫీని పరిశీలిద్దాం. ఇదేమీ రైతులు కోరింది కాదు. ఇతర పార్టీలు డిమాండ్ చేసింది కాదు. కాంగ్రెస్ పార్టీయే తనకుతానుగా వాగ్దానం చేసి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. మరి అమలు చేయాల్సిన పూచీ ఎవరిది? ఆ పార్టీదే కదా? దాన్నే బీఆర్ఎస్ తరపున ఉద్యమ నాయకుడు హరీశ్రావు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే దీన్ని నెరవేరుస్తామని ప్రకటించింది. పార్టీ ఇచ్చిన హామీని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
రుణమాఫీ చేస్తామని అన్నామే గానీ మొదటి వంద రోజుల్లో అమలు చేస్తామనలేదని ప్రభుత్వ పెద్దలు మాట మార్చారు. సరే దీనికీ ఒప్పుకొందాం. కొత్త ప్రభుత్వానికి కొంత ఊపిరి తీసుకునే సమయమైనా ఇవ్వాలి కదా. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కోడ్, నిధుల సర్దుబాటు, ఇతర ఇబ్బందులుంటాయి, కాదన లేం. కానీ, సమస్య ఎక్కడ వచ్చిందంటే… రుణ మాఫీకి నిధులు విడుదల చేయలేకపోయినా అందుకు సంబంధించిన కసరత్తును మొదటి వందరోజుల్లోనే ఎందుకు ప్రారంభించలేదన్న ప్రశ్న తలెత్తుతున్నది.
రుణమాఫీ చిన్న విషయమేమీ కాదు. ఎంతమంది రైతులున్నారు? ఎంత మొత్తం రుణం ఉన్నది? అన్న సమాచారం మొదలు తెలుసుకోవాలి. ఇందుకోసం లీడ్ బ్యాంకుకు లేఖ రాయాలి. అర్హులైన రైతులను ఎలా గుర్తించాలి? కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? ఎవరైనా రైతులు ముందుగా చెల్లించి ఉంటే సమానత్వ సాధన కోసం వారి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి? హామీ ఇచ్చినట్టు మొత్తం రూ.2 లక్షలు రద్దు చేస్తారా? లేదంటే ఎకరానికి ఇంత అన్న పరిమితి విధిస్తారా? ఇవన్నీ తేలాలి. సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి కూడా సమాచారం తెప్పించుకోవాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖకో, ఆర్థిక శాఖకో ఒక సర్క్యులర్ గానీ, ఆర్డర్ గానీ పంపించి ఉంటే ఈపాటికే కొంత స్పష్టత ఉండేది. రుణమాఫీ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అందులో ఉన్న ఇబ్బందులను అధికారులతో చర్చించి. ఇతర రాష్ర్టాల్లో కూడా గతంలో అమలైంది. అక్కడి అనుభవాలేమిటి? ఎదురైన సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారు? ఇలాంటి సమాచారం అంతా సేకరించాలి. మ్యానిఫెస్టోలోని అంశం కాబట్టి ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇదంతా జరిగి ఉంటే రుణమాఫీపై మార్గదర్శకాలు ఇప్పటికే సిద్ధమై ఉండేవి. ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్న నమ్మకం రైతుల్లో కలిగి ఉండేది. ఇవేవీ జరగడం లేదన్నదే హరీశ్రావు ఆవేదన అంతా. మరోసారి రైతులను మోసం చేస్తుందనేదే ఉద్యమ నాయకుడి ఆవేదన.
ఆర్థికమంత్రిగా ఆయనకున్న అనుభవంతో రుణ మాఫీకి మొత్తం రూ.39 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా సేకరిస్తారు? అసలు రుణమాఫీకి రిజర్వ్బ్యాంక్ ఎంతవరకు అంగీకరిస్తుంది? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఇలా చర్చకు వచ్చే అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. వీటిపై ఇంతవరకు ఎలాంటి పేపర్ వర్క్ జరగలేదు కాబట్టే పంద్రాగస్టు నాటికి రుణమాఫీ అమలు చేయలేరని ఆయన అంత గట్టిగా చెప్తున్నారు. ఆ రోజున జెండా ఎగురవేసి ఏదో మొక్కుబడిన ఒకరిద్దరు రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేస్తే కుదురుతుందా? అది మాటను నిలబెట్టుకోవడం అవుతుందా? ఏక కాలంలో రూ.2 లక్షలను మాఫీ చేయాలని, అదీ రైతులందరికి ఒకేసారి చేయాలని హరీశ్రావు పట్టుబడుతున్న విషయాన్ని మరచిపోకూడదు. లేదంటే ఒకరిద్దరు రైతులకు రుణమాఫీ పత్రాలిచ్చి మోసం చేసే వ్యక్తి రేవంత్రెడ్డి.
మరో అంశాన్ని కూడా పరిశీలించాలి. ఈ ఏడాది జూన్లో బాగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అంటే, రైతులు మే నెల నుంచే వానకాలం పంటలకు సన్నద్ధం కావాలి. మరి పెట్టుబడుల కోసం వారు బ్యాంకుల వద్దకు వెళ్తే వారికి అక్కడ ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామంటారా? రుణమాఫీపై మాకు ఎలాంటి సమాచారం రాలేదంటారో? ఏమంటారో తెలియదు. ధరణి పోర్టల్ను నిలిపి వేస్తామంటున్నారు. మరి, రుణాలు పొందడానికి పాస్ పుస్తకాలు పెట్టాలా? బ్యాంకులు ఎలాంటి అభ్యంతరాలు పెడుతాయో తెలియదు. అందువల్ల బ్యాంకులకు తగిన సమాచారం ఉంటే గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. ఇవన్నీ రైతులు రోజూ మాట్లాడుకునే విషయాలే. వీటిని రైతుల పక్షాన అడుగుతున్నారనే హరీశ్రావుపై విమర్శలు. రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు. ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే అందులో రాజకీయం ఏముంది? తులం బంగారం ఇస్తామన్న హామీని ప్రజలు అంతగా నమ్మారో లేదో తెలియదు గానీ, రుణమాఫీ మాత్రం తప్పకుండా జరుగుతుందన్న నమ్మకంలో రైతులున్నారు. ఆ ఆశ వమ్ము కాకుండా చూడాలన్నదే ఆయన తాపత్రయం.
మిగిలిన హామీలను కాసేపు పక్కనపెట్టినా వరికి రూ.500 బోనస్ ఇస్తామన్న వాగ్దానం అమలుపై కూడా ప్రభుత్వం నుంచి ప్రకటనలేమీ రాలేదు. వ్యవసాయ మంత్రి ఏమో వచ్చే వానాకాలం పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి దానిపైన రైతులకు ఏమీ చెప్పడం లేదు. ఒకవైపు వడ్లు కళ్లాల కాడికి వచ్చి ఉన్నాయి. మరో వైపు రైతుపై అకాల వర్షం దాడి. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ మాట ఎలా ఉన్నా, ప్రకటించిన మద్దతు ధర ఎంతవరకు అమలవుతున్నదో, లేదో చూసే పరిస్థితులే కనిపించడం లేదు.
అది తెలిస్తే కదా బోనస్ను అమలుచేయడం సాధ్యపడుతుంది. కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ బోనస్ తక్షణావసరం. దీన్ని ఎలా అమలుచేస్తారో స్పష్టత కూడా లేదు. పార్టీలో కిసాన్ కాంగ్రెస్ అన్న ప్రత్యేక విభాగమే ఉన్నది. దీనికి అధ్యక్షత వహించేవారు సీనియర్లు, రైతుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు. బోనస్ విషయమై వారితోగానీ, రైస్ మిల్లర్లు, వ్యాపారులతో కానీ చర్చలు జరిపిన సందర్భం ఇంతవరకు లేదు. ప్రాథమిక చర్యలే ప్రారంభం కానప్పుడు హామీ అమలవుతుందన్న నమ్మకం రైతులకు ఎలా కలుగుతుంది? వానకాలం పంటల నుంచి దీన్ని అమలుచేస్తామంటే సెప్టెంబర్, అక్టోబర్ నాటికిగానీ ఇది అమలు చేయరన్న మాట. అంటే సుమారుగా ఏడాది ఆలస్యం కానున్నది.
హరీశ్రావు చేస్తున్నది సద్విమర్శ. నిర్మాణాత్మక సలహా. పోనీ రాజకీయ కోణంలోనో, ప్రజలను రెచ్చగొట్టే విధంగానో విమర్శలు చేస్తున్నారనంటే అవేవో చెప్తే బాగుంటుంది. వీటిపై స్పందించకుండా ‘దూలంలా ఉన్నావు’ అని ముఖ్యమంత్రి అంతటి వారే విమర్శలు చేయడం సబబు అనిపించుకోదు. రైతులే హరీశ్ను గెలిపించుకున్నారు. వాళ్లకోసమే ఒక శ్రామికుడుగా ఆయన పోరాటం చేస్తున్నారు, చేస్తారు. హరీశ్రావు మలిదశ ఉద్యమం మొదలు పెట్టి తెలంగాణను విముక్తి చేసిన మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్భవించిన ఉద్యమ నాయకుడు. 24 ఏండ్లు తెలంగాణ విముక్తి కోసం నిరంతర శ్రామికుడిగా కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అహర్నిశలు హరీశ్రావు ఉద్యమించారు. 1969లో తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి అమరవీరుల త్యాగాల విలువ రేవంత్ రెడ్డికి ఎలా తెలుస్తుంది? కనీసం ఇప్పటివరకు అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి అమరవీరులకు జోహార్లు చెప్పని రేవంత్రెడ్డి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.
ఇవేకాకుండా సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లకుండా హుందాతనంగా వ్యవహరించాలి. ప్రభుత్వ హామీలపైనే ప్రశ్నిస్తున్నప్పుడు అదే రీతిలో జవాబిస్తే బాగుంటుంది. ముఖ్యంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హామీలను అమలు చేయించాలనే ఒత్తిడి పెంచే ఉద్దేశ్యంతోనే హరీశ్రావు తన పదవిని పణంగా పెట్టారు. ఎమ్మెల్యే పదవి ఆయన వ్యక్తిగతమైనది కాదు, తనపై నమ్మకం ఉంచి వరుసగా ఘన విజయాలు ఇస్తున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరిదీ. ఇలాంటి పదవిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారంటే ఆయన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ‘నేను ఐదేండ్లు పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది?’ అని నిర్భీతిగా ప్రకటించారు. చూద్దాం ఏం జరుగుతుందో?
(వ్యాసకర్త: అధ్యక్షులు, జనతంత్ర వేదిక )
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817