Masala Row | భారత్కు చెందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ప్రకటించాయి. ఇటీవల ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించి.. తిరిగి వాటిని భారత్ పంపేయాలని ఆదేశించింది. ఎండీహెచ్ సాంబార్ మసాలాలో సైతం కేన్సర్ కారకాలు ఉన్నట్లుగా తేలింది. దాంతో ఎండీహెచ్ మలాసాపై హాంకాంగ్ సర్కారు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సైతం దృష్టి సారించి.. ఆయా ఉత్పత్తులపై దృష్టి సారించి.. వివరాలు సేకరిస్తున్నది.
ఆయా దేశాల నుంచి సైతం వివరాలు సేకరణలో నిగమగ్నమైంది. ఈ క్రమంలో ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ (FSANZ) మంగళవారం ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా మార్కెట్ నుంచి ఆయా కంపెనీల మసాలాలను రీకాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. హాంకాంగ్ ఇటీవల మూడు ఎండీహెచ్ మసాలా దినుసులు, ఎవరెస్ట్ చేపల మసాలాలు విక్రయాలను నిషేధించింది. ఎథిలీన్ ఆక్సైడ్ అధికంగా ఉన్నందున సింగపూర్ ఎవరెస్ట్ మసాలాను మార్కెట్ నుంచి రీకాల్ చేసింది.
సమస్యను అర్థం చేసుకునేందుకు ఇతర దేశాలతో కలిసి పని చేస్తున్నామని. ఆస్ట్రేలియాలోనూ తదుపరి చర్యలు అవసరమా? కాదా? అని నిర్ణయించేందుకు ఫెడరల్ స్టేట్ అండ్ టెరిటరీ ఫుడ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నట్లు ఫుడ్ స్టాండర్డ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియాలో విక్రయించే ఆహార పదార్థాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ వాడేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఎండీహెచ్, ఎవరెస్ట్ ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో అధికంగా అమ్ముడయ్యే మసాలాలు. అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నది.