హైదరాబాద్ : అంతర్జాలం వేదికగా ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’ ఉత్సాహభరితంగా కొనసాగింది. ‘వంశీ ఇంటర్నేషనల్’, శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్, ‘తెలుగు కళా సమితి’ ఒమాన్, ‘సంతోషం ఫిలిం న్యూస్’ వారి ఆధ్వర్యంలో డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో ఆదివారం అంతర్జాలంలో అద్భుతంగా 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించబడింది. ఇందులో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు, కవయిత్రులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించి శ్రోతలను రంజింపజేశారు.
అందరినీ అలరించిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, కె.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోపన్యాసం చేశారు. అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథులుగా ‘తెలంగాణ సారస్వత పరిషత్’ కార్యదర్శి జె. చెన్నయ్య, ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ అధ్యక్షులుడు వంగూరి చిట్టెన్ రాజు, ‘ఒమాన్ తెలుగు కళా సమితి’ కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుంచి రావి దీపిక వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు మాట్లాడుతూ.. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న ‘కొత్త కథలు’ సంకలనం వలె ఈ సంవత్సరం నుంచి ‘కొత్త కవిత’ అనే కవితా సంకలనం తీసుకురావాలని సంకల్పించామన్నారు. డాక్టర్ సినారె 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సహకారంతో త్వరలో ఈ కార్యక్రమంలో చదవబడిన కవితలన్నీ కవితా సంకలనంగా ముద్రించబడతాయని తెలిపారు.
భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డికి కవితానివాళులు అర్పించారు.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాల నుంచి ఎంతో మంది కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమ సహ నిర్వాహకులు ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ..సింగపూర్ నుంచి తొలిసారి ఈ కార్యక్రమంలో 14 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందన్నారు.
రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో ప్రారంభ సమావేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల కవితా పఠనం కొనసాగగా, ఆఫ్రికా ఐరోపా ఖండాల వారికి పీసపాటి జయ, మధ్య ఆసియా దేశాలవారికి కొండూరు కళ్యాణి, కెనడా వారికి రాయవరపు లక్ష్మి, అమెరికా వారికి నోరి రాధిక సహవ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చారు.
ఇవి కూడా చదవండి..
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్