టోక్యో: ఒలింపిక్స్లో ఆదివారం ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్ చేరడమే ఓ అద్భుతం అనుకుంటే.. సోమవారం మహిళల టీమ్ అంతకుమించిన అద్భుతాన్నే సాధించింది. లీగ్ స్టేజ్లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడి.. క్వార్టర్స్కు కూడా వెళ్లకుండానే ఇంటిదారి పడుతుందనుకున్న టీమ్.. ఇప్పుడు ఏకంగా మాజీ చాంపియన్స్ ఆస్ట్రేలియాకే షాకిచ్చి సెమీఫైనల్ చేరడం మామూలు విషయం కాదు. అందులోనూ ఒలింపిక్స్లో ఈ స్టేజ్కు రావడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజంగానే రాణి రాంపాల్ టీమ్ చరిత్రలో అత్యంత అరుదుగా సాధ్యమయ్యే విజయాన్ని సాధించింది.
ఇదే ఆస్ట్రేలియాతో రియో గేమ్స్లో ఇండియా వుమెన్స్ టీమ్ 1-6తో చిత్తుగా ఓడింది. కానీ ఇప్పుడు అదే హాకీరూస్కు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఈ విజయాన్ని సోషల్ మీడియా చాలా ఘనంగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. మదర్ ఆఫ్ ఆల్ అప్సెట్స్ అంటూ ఈ విజయాన్ని అభివర్ణించడం విశేషం. ఇండియన్ మెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ వీరేన్ రస్కినా ఈ విజయంపై స్పందిస్తూ.. బహుశా చరిత్రలో ఇంతకు మించిన అప్సెట్ ఉండదేమో అని ట్వీట్ చేశాడు.
ఇప్పటి వరకూ ఒలింపిక్స్లో భారత మహిళలు సాధించిన అత్యుత్తమ ఫలితం నాలుగోస్థానం. అది కూడా 1980 ఒలింపిక్స్లో. మొత్తం ఆరు టీమ్సే పాల్గొనగా.. అందులో నాలుగో స్థానం సాధించింది. ఆ గేమ్స్లోనే తొలిసారి ఇండియన్ వుమెన్స్ టీమ్ ఒలింపిక్స్లో ఆడింది. ఇక ఇప్పుడు లీగ్ స్టేజ్లో ఐర్లాండ్, సౌతాఫ్రికాలపై వరుస విజయాలు సాధించి క్వార్టర్స్లో అడుగు పెట్టిన మన టీమ్.. గ్రూప్లో టాప్ ప్లేస్తో క్వార్టర్స్ చేరిన ఆసీస్కు షాకివ్వడం నిజంగా మాటల్లో వర్ణించలేని విజయమే.